గుంటూరు వెస్ట్: జిల్లాలో ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమం పురోగతి, అమలు తీరుపై భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భానుప్రకాష్ ఏటూరు బుధవారం జిల్లా కలెక్టరేట్లోని వీసీ హాల్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మలతో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమాన్ని పారదర్శకంగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ బ్యాంకుల తీరుపై అసంతృప్తి
గుంటూరు వెస్ట్: ప్రభుత్వ పథకాలను అందించడంలో ప్రైవేట్ బ్యాంకులు విఫలం అయ్యాయని, ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రైవేట్ బ్యాంకుల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలను బ్యాంకర్లు ప్రోత్సహించేలా రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలన్నారు. పశు, మత్స్య, కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహించాలని తెలిపారు. పీఎం సూర్యఘర్, ముద్ర, పీఎంఈజీపీ రుణాలను మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో యూబీఐ డీజీఎం హనుమంత్ రెడ్డి, ఆర్బీఐ ఏజీఎం కిరణ్, లీడ్ బ్యాంకు మేనేజర్ మహిపాల్ రెడ్డి, నాబార్డ్ డీడీఎం శరత్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


