మేడికొండూరు: మండల పరిధిలోని పేరేచర్లలో శనివారం సాయంత్రం పేరచర్ల గ్రామవాసులు బ్లాస్టింగ్ పూర్తిగా నిలుపుదల చేయాలని కోరుతూ గుంటూరు– హైదరాబాదు ప్రధాన రహదారిపై మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. క్వారీ యజమానులు నిబంధనలు పాటించకుండా బ్లాస్టింగ్ ఎక్కువ మోతాదులో నిర్వహించడం వలన తమ ఇల్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇల్లు నిర్మించుకున్న తమకు బ్లాస్టింగ్ వలన ఇళ్లకు పగుళ్లు ఏర్పడి రాళ్లు మీద పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు. రేకుల ఇల్లు నిర్మించుకున్న వారి పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని, క్వారీలో బ్లాస్టింగ్ దాటికి రాళ్లు ఎగిరిపడి రేకులపై పడి ఇల్లు పూర్తిగా దెబ్బతినటమే కాకుండా టీవీలు, ఇంటి సామగ్రి సైతం పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేరేచర్ల ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మేడికొండూరు పోలీసులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు శాంతించారు.


