జాతీయ రహదారిపై పసుపు కొమ్ముల లారీ బోల్తా | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై పసుపు కొమ్ముల లారీ బోల్తా

May 14 2026 6:21 AM | Updated on May 14 2026 6:21 AM

క్లీనర్‌ మృతి, డ్రైవర్‌కు గాయాలు

పెదకాకాని: జాతీయ రహదారిపై వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన సంఘటన బుధవారం పెదకాకాని వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా, తోట్లవల్లూరు మండలం, బద్రిరాజుపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు కడప జిల్లా మైదుకూరులో విత్తన పసుపు కొమ్ములు కొనుగోలు చేశారు. అక్కడి నుంచి లారీ బాడుగకు మాట్లాడుకుని ఆ విత్తన పసుపు కొమ్ములను లారీలో లోడు చేయించారు. పసుపు కొమ్ములతో బయలుదేరిన బుధవారం ఉదయం పెదకాకాని సమీపంలోకి చేరుకుంది. లారీ డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పి ప్రక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొని ఫల్టీ కొట్టింది. లారీలో ఉన్న పసుపు కొమ్ములు రోడ్డుపై చెల్లా చెదురుగా పడటంతో వెనుక నుంచి వెళుతున్న వాహనాలు తొక్కుకుంటూనే ప్రయాణాలు సాగించాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ కుమార్‌, క్లీనర్‌ ప్రసన్నకుమార్‌లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్లీనర్‌ ప్రసన్నకుమార్‌ పరిస్థితి విషమంగా మారడంతో చినకాకాని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ప్రసన్నకుమార్‌(24) మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెదకాకాని పోలీసులు డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పసుపు కొమ్ములను ఒక చోటకు చేర్చి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతుని సోదరుడు రాజ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ టిపి నారాయణస్వామి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement