ఎన్టీఏ ఏజెన్సీ అనుమతులు తక్షణమే రద్దు చేయాలి ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి యశ్వంత్ రఘువీర్ డిమాండ్
లక్ష్మీపురం: ‘నీట్’ రద్దుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బండారుపు యశ్వంత్ రఘవీర్ డిమాండ్ చేశారు. గుంటూరులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష రాశారని చెప్పారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల ఉన్నత విద్య చదవాలని, డాక్టర్ అవ్వాలనే ఆకాంక్షతో నీట్ ప్రవేశ పరీక్షకు ప్రిపేర్ అయ్యి పరీక్ష రాశారని చెప్పారు. కానీ వారి కలలను నీరుగార్చి వారి జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో హరియాణా, బిహార్ రాష్ట్రాలలో నీట్ పరీక్ష పేపర్ను 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు అమ్ముకొని లీకేజ్ చేశారని గుర్తు చేశారు. గతంలో ఏ రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్రాలలో నీట్ ప్రవేశ పరీక్ష ఏర్పాటు చేసేవారని చెప్పారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యదర్శి సుదర్శనం అమర్నాథ్, నగర నాయకులు మహేష్, సాయి గణేష్ పాల్గొన్నారు.


