ఎన్జీ రంగా వర్సిటీలో ఎస్‌ఎల్‌టీపీ ప్రోగ్రాం | - | Sakshi
Sakshi News home page

ఎన్జీ రంగా వర్సిటీలో ఎస్‌ఎల్‌టీపీ ప్రోగ్రాం

May 12 2026 5:24 AM | Updated on May 12 2026 5:24 AM

గుంటూరు రూరల్‌: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో స్ట్రేట్‌ లెవెల్‌ టెక్నికల్‌ ప్రోగ్రామ్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్‌ పి.వి.సత్యనారాయణ అధ్యక్షతన సోమవారం ప్రారంభించారు. సమావేశాలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశోధన స్థానాలలో గత సంవత్సరం నిర్వహించిన పరిశోధనలను సమీక్షించారు. పరిశోధనల ఫలితాలను విశ్లేషించి, రైతుల సమస్యలను, వారి అవసరాలను గుర్తించి, వాటికనుగుణంగా రాబోవు సంవత్సరంలో నిర్వహించాల్సిన పరిశోధనలకు ప్రణాళికలను రూపొందించారు. నేటి నుంచి 22వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. జన్యుశాస్త్రం, మొక్కల ప్రజననం, అణు జీవశాస్త్రం, జీవ సాంకేతికత విత్తన విజ్ఞానశాస్త్రం, సాంకేతికత తదితర విషయాలపై చర్చించారు. పరిశోధన సంచాలకురాలు డాక్టర్‌ వి.సుమతి మాట్లాడుతూ జెర్మ్‌ ప్లాజమ్‌ డిజిటలైజ్‌ చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. పరిశోధనలకై డిబిటీ, డీఎస్‌టీ వంటి సంస్థల నుండి బాహ్య నిధులు సమీకరించాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీ హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ డాక్టర్‌ ఎస్‌.వసుంధర గత సంవత్సర నివేదికను సమర్పించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్‌ పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ వరి, వేరుశనగ, అపరాల పరిశోధనలో అగ్రగామి విశ్వవిద్యాలయం మరింత మెరుగ్గా పనిచేసి యూనివర్సిటీ ఖ్యాతిని పెంచి, రైతులకు సేవనందిచాలని తెలిపారు. కార్యక్రమం ఐసీఏఆర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.పి.భదానా, ఐసీఏఆర్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.మురళీధరన్‌, టీఎన్‌ఏయూ రిటైర్ట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఏ సత్యనారాయణ, విస్తరణ సంచాలకులు, డాక్టర్‌ జి. రామచంద్రరావు, డాక్టర్‌ దుర్గాప్రసాద్‌, డాక్టర్‌ రాధిక పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement