గుంటూరు ఎడ్యుకేషన్: అధ్యాపక ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్సీ ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలను ఈనెల 23న గుంటూరులోని ఏసీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఎంజే మాణిక్యరావు మెమోరియల్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. సోమవారం అరండల్పేటలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో శత జయంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ ఎయిడెడ్ అధ్యాపకుల సంక్షేమం కోసం ఎంజే మాణిక్యరావు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని చెప్పారు. ఆయన పోరాట ఫలితమే ఎయిడెడ్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ప్రభుత్వం నుంచి పలు ప్రయోజనాలు పొందుతున్నారని అన్నారు. ఈనెల 23న జరిగే శత జయంతి ఉత్సవాలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఏఎన్యూ మాజీ వీసీ ప్రొఫెసర్ వి. బాలమోహన్ దాస్, మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అధ్యాపకులు హాజరు కానున్నారని తెలిపారు. ఎంజే మాణిక్యరావు స్ఫూర్తితో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.మోజెస్, ఉపాధ్యక్షుడు ఎం.విజయకుమార్, ప్రతినిధులు డీవీ సోమయ్యశాస్త్రి, ప్రమీల, హేమలత, బోసుబాబు, దుర్గాప్రసాద్, గంగాధర్రావు పాల్గొన్నారు.


