పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): హనుమజ్జయంతిని పురస్కరించుకుని గుంటూరు నగరంలోని నాజ్ సెంటర్లో వేంచేసియున్న ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు జరిగే జయంత్యుత్సవాల్లో భాగంగా శనివారం పంచామృత స్నపన, లక్ష తులసి పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు నరసింహాచార్యులు ఆధ్వర్యంలో లక్ష తులసి పూజ శాస్త్రోక్తంగా చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి టి.సుభద్ర కార్యక్రమాలను పర్యవేక్షించారు. శ్రీహనుమాన్ దీక్ష సమాజం గౌరవ అధ్యక్షుడు తిరువల్లూరి వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 8 గంటలకు గ్రామోత్సవ హనుమాన్ దీక్ష సమాజం వారిచే ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున పురవీధుల్లో దీక్ష సమాజం సభ్యులు, దీక్షాపరులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో దీక్ష సమాజం సభ్యులు నాగేశ్వరరావు, సీహెచ్ మారుతి, వెంకటరమణ, వంశీ ప్రసాద్, బాపిరాజు, కిషోర్, ఆలయ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


