మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం నిడమర్రు గ్రామం వద్ద నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కార్యక్రమ ఇన్చార్జి అధికారి, గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. ఈనెల 13న నిడమర్రు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేయనున్న నేపథ్యలో వేదిక ప్రాంతాన్ని శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలసి పరిశీలించారు. మయూర్ అశోక్ మాట్లాడుతూ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సోమన్న, కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంటీఎంసీ డెప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, డీసీపీ అశోక్కుమార్, రైల్వే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రసాదరావు, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, రూరల్ సీఐ వెంకట బ్రహ్మం, తహసీల్దార్ రాఘవేంద్ర పాల్గొన్నారు.


