ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ పరిధిలో జరిగిన ఎంబీఎ ఇంటర్నేషన్ బిజినెస్, ఎల్ఎల్బీ, ఎంపీఈడీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఫిబ్రవరిలో జరిగాయి. ఈ పరీక్షలకు 48 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 46 మంది ఉత్తీర్ణులయ్యారు. 2025 నవంబరులో జరిగిన ఎల్ఎల్బీ రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలు, 2025 డిసెంబరులో జరిగిన ఎంపీఈడీ మూడవ సెమిస్టర్ రీవాల్యేషన్ ఫలితాలను విడుదల చేశారు. పూర్తి వివరాలు వర్సిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సీఈ తెలిపారు.
క్యాష్ డిపాజిట్
చేస్తామంటూ మోసం
తెనాలిరూరల్: ఏటీఎం సెంటరులోని క్యాష్ డిపాజిటట్ మెషిన్లో డబ్బు వేసేందుకు వెళ్లిన వ్యక్తి మోసం చేసి రూ. 50 వేలు తీసుకెళ్లిన ఘటన తెనాలిలో గురువారం జరిగింది. పట్టణానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి తన కుమారుడి చదువు అవసరాల కోసం ఏటీఎంలో నగదు జమ చేస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు సహాయం చేస్తామంటూ అకౌంట్లో డబ్బులు వేస్తున్నట్టు నమ్మించారు. అనంతరం చాకచక్యంగా రూ.50 వేల నగదును తీసుకుని పరారయ్యారు. మోసపోయిన విషయం గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు తెలిసింది. ఏటీఎంలోని సెక్యూరిటీ గార్డు అని భావించి బాధితుడు మోసపోయినట్టు సమాచారం.
రైలు నుంచి పడి
గుర్తు తెలియని వ్యక్తి మృతి
తెనాలిరూరల్: రైలు నుండి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తెనాలి–విజయవాడ రైలు మార్గంలోని చిలువూరు స్టేషన్కు కిలోమీటరు దూరంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి గురువారం వెళ్లారు. సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. రైలు నుంచి జారి పడడం వల్ల మృతి చెందాడని ప్రాథమికంగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జీఆర్పీ ఎస్ఐ ఎల్.సరస్వతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎరుపు టీషర్టు, ఎరుపు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని కోరారు.


