తాడికొండ పార్టీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు తక్షణమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్
మేడికొండూరు: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు అన్నారు. మేడికొండూరు మండల పరిధిలోని జంగంగుంట్ల పాలెంలో మొక్కజొన్న రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మొక్కజొన్నలను గ్రామాల్లోకి తమ ఇంటి వద్దకు వచ్చి కొనుగోలు చేసే వారని రైతులు చెబుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకే కొనుగోలు చేసేవారని పేర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని తెలిపారు. ఈ క్రాప్ చేసిన తర్వాత గిట్టుబాటు ధరకు కేంద్రానికి లెటర్ రాయాలని రైతులకు కలబొల్లి మాటలు చెబుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర రూ.2,400లకు రైతుల వద్ద కొనుగోలు చేయకపోతే రాబోయే రోజులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. అదేవిధంగా మేడికొండూరులో పంట కొనుగోలుపై స్పష్టత కొరవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.
ధరలు నేలచూపు
రబీలో కష్టపడి పండించిన మొక్కజొన్న పంట విక్రయానికి రైతులు ఎదురుచూస్తున్నారని, చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేయడంతో ధరలు నేల చూపు చూస్తున్నాయని వాపోతున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంటూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మేడికొండూరు మండలంలో 1,295 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారని తెలిపారు. ఈ ఏడాది మొక్కజొన్న సాగుకు ఎకరానికి 45 నుంచి 50 క్వింటాలు వరకు దిగుబడి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పటికే 90 శాతం కోతలు పూర్తయినా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మొక్కజొన్న రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తాళ్లూరి వంశీకృష్ణ, రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి ఆవుల రమణారెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, బొడ్డు పెద్ద సాంబయ్య, బొడ్డు చిన్న సాంబయ్య, ఆమతి రాఘవరావు, సాంబిరెడ్డి, రవికృష్ణ, రవికిషోర్రెడ్డి, అచ్యుతరామయ్య, షేక్ రబ్బాని, ఉడత శ్రీనివాసరావు, అబ్బాస్, కొరివి చెన్నయ్య, కొరివి కిషోర్, తమనపల్లి శాంతయ్య, ముత్యాల బాలస్వామి, గండికోట రసూలు, లుర్డు రాజు, నోసిన కోటేశ్వరరావు, షేక్ జిలాని, షేక్ బుడే, మక్బూల్, ఆలూరి శ్రీనివాసరావు, జగదీష్, సూర్యనారాయణ రెడ్డి, డేవిడ్, తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


