కేవీకే శాస్త్రవేత్త గంగాదేవి
చేబ్రోలు: మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి జాతీయ స్థాయి పేటెంట్ లభించినట్లు ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిశోర్ బుధవారం తెలిపారు. వీసీ మాట్లాడుతూ విజ్ఞాన్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన పరిశోధన విద్యార్థి అంపసాని చెన్నయ్య, డాక్టర్ కె. చంద్రశేఖర్ సంయుక్తంగా ప్రతిపాదించిన పరిశోధనకు ఈ పేటెంట్ మంజూరైనట్లు వెల్లడించారు. ‘పోర్టబుల్ సాయిల్ ఫెస్టిసైడ్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్ కిట్’ అనే అంశంపై చేసిన పరిశోధనకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా అథారిటీ సంస్థ పేటెంట్ను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పేటెంట్కు 20 సంవత్సరాలపాటు హక్కులు ఉంటాయని వివరించారు. ఈ కిట్ వ్యవసాయ భూముల్లో పురుగు మందుల అవశేషాలను తక్షణమే గుర్తించి విశ్లేషించడానికి ఉపయోగపడుతుందని, రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారే అవకాశం ఉందని వివరించారు. బయోటెక్ విభాగానికి చెందిన డాక్టర్ కే చంద్రశేఖర్(హెచ్–ఇండెక్స్–43), ఫార్మసీ విభాగానికి చెందిన డాక్టర్ మిథున్ రుద్రపాల్(హెచ్–ఇండెక్స్–36) స్కోపస్లో అత్యుత్తమ హెచ్–ఇండెక్స్ను సాధించినట్లు చెప్పారు. జాతీయ స్థాయి పేటెంట్ సాధించిన పరిశోధన విద్యార్థి అంపసాని చెన్నయ్య, డాక్టర్ కె. చంద్రశేఖర్, అలాగే ఉత్తమ హెచ్–ఇండెక్స్ సాధించిన డాక్టర్ మిథున్ రుద్రపాల్, డాక్టర్ కె.చంద్రశేఖర్లను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిశోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావులు అభినందించారు.


