జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ వ్యక్తిగత సమాచారం చాలా సురక్షితం
గుంటూరు వెస్ట్: జనగణన 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఇళ్ల గణనపై అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 62,434 కుటుంబాలు స్వీయ గణనలో వివరాలు నమోదు చేసుకున్నాయని తెలిపారు. జనగణన పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతోందన్నారు. జిల్లాలో 3,803 హౌస్ లిస్టింగ్ బ్లాక్లను ఏర్పాటు చేశామన్నారు. 4,046 మంది ఎన్యుమరేటర్లను, 720 సూపర్ వైజర్లను, 23 మంది ఛార్జ్ అధికారులను నియమించామన్నారు. ఇందులో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది 3213, జూనియర్ సహాయకులు 383 మంది, సీనియర్ సహాయకులు 220 మంది, ఇతరులు 950 మంది ఉన్నారని తెలిపారు. సిబ్బంది అందరికీ శిక్షణ నిర్వహించామని చెప్పారు. ఎన్యుమరేటర్లకు జనగణనకు అవసరమయ్యే కిట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్యుమరేటర్లు అంకితభావంతో పనిచేసి సరైన డేటా సేకరణ చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు అవకాశం కల్పించగా, ఇళ్ల గణన మే 1వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ఎన్యుమరేటర్స్కి, సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, సీపీఓ పి.శేషశ్రీ, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.


