తెనాలి: రూరల్ మండల గ్రామం కొలకలూరులో కొలంకపూరి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉభయ రాష్ట్రస్థాయి 12వ ఆహ్వాన నాటికల పోటీలు మే నెల 2,3,4,5 తేదీల్లో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి (భాషా సాంస్కృతిక శాఖ) సౌజన్యంతో జరిగే ఈ పోటీలు ఈసారి కొలకలూరు పంచాయతీ పరిధిలోని ఖాజీపేట నాటకశాల వద్ద ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల్నుంచి జరుగుతాయని కళాపరిషత్ కార్యదర్శి గోపరాజు విజయ్ బుధవారం ప్రకటించారు. ఈ పోటీల్లో భాగంగా తొలిరోజున గోపరాజు బాల త్రిపురసుందరమ్మ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటీమణి దాసరి రమాదేవి (హైదరాబాద్కు ప్రదానం చేస్తారు. 3వ తేదీ రాత్రి కరణం సురేష్ జ్ఞాపకార్ధం ఏటా ఇస్తున్న సవ్యసాచి అవార్డును ప్రముఖ రంగస్థల, టీవీ, సినీనటుడు డాక్టర్ వెంకట్ గోవాడ (హైదరాబాద్), గోపరాజు హేమలత జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటి ఎస్.జ్యోతిరాణి (విజయనగరం)లకు బహూకరిస్తారు. 4వ తేదీన కొలంకపురి కళాపరిషత్ రచనల పోటీల విజేతలకు నగదు బహుమతుల ప్రదానోత్సవం ఉంటుంది. చివరిరోజున గోపరాజు చక్రపాణి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల, టీవీ, సినీ నటుడు డాక్టర్ సీఎస్ ప్రసాద్ (కాకినాడ)కు అందజేసి సత్కరిస్తారు.
డాక్టర్ గోవాడ వెంకట్
దాసరి రమాదేవి


