గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణ చేపట్టేందుకు తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న అన్ని నియోజకవర్గాల్లో ధర్నా చేపడుతున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద ధర్నా పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తమ ప్రయోజనాలను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఎలా భావించాలో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రచురణల విభాగ చైర్మన్ ఎం. హనుమంతరావు మాట్లాడుతూ ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు ఎం.గోవిందు, బి.ప్రసాదు, ఎం.కోటిరెడ్డి, ఆడిట్ కమిటీ సభ్యులు కె.ప్రేమ్ కుమార్, వి.వినోద్ రాష్ట్ర కౌన్సిలర్ గఫార్ పాల్గొన్నారు.


