
నేటి నుంచి ఇస్కాన్ రథయాత్ర
ఆటోనగర్(విజయవాడతూర్పు): దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రథయాత్రగా పేరుగాంచిన ఇస్కాన్ విజయవాడ వారి జగన్నాథస్వామి రథయాత్ర ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు జరుగుతుందని స్థానిక ఇస్కాన్ మందిర అధ్యక్షుడు చక్రధారిదాస్ తెలిపారు. గురువారం 16వ డివిజన్లోని పాత వీబీఎం కాలేజీలోని ఇస్కాన్ మందిరంలో ఆయన విలేకరుల సమావేశంలో రథయాత్రకు సంబంధించిన పోస్టర్లతో పాటు టీషర్ట్లు, టోపీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చక్రధారిదాస్ మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రథయాత్రను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నట్టు చెప్పారు. జూన్ 27 నుంచి 29 వరకు ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి 3.5 ఎకరాల విస్తీర్ణంలో రథయాత్ర మేళా మహోత్సవం జరగనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ప్రత్యేకంగా జూన్ 29న సుమంగళి సుభద్ర అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు 1000 మందికి పైగా మహిళలు సుభద్ర అమ్మవారికి 4 ఎద్దుల బండ్లలో ఊరేగింపుగా వచ్చి సారె సమర్పించనున్నట్లు చెప్పారు. భవానీపురంలోని సితారా గ్రౌండ్స్, స్వాతి థియేటర్, కనకదుర్గ అమ్మవారి గుడిరోడ్డు మీదుగా రథం సెంటరు సీతమ్మవారి పాదాలు వరకు రథయాత్ర సాగుతుందన్నారు.
వారాహి ఉత్సవాలకు శ్రీకారం
నాగాయలంక: స్థానిక కృష్ణానదీ తీరంలోని శ్రీరామ పాదక్షేత్రం సముదాయంలోని శ్రీకనకదుర్గమ్మ ఆలయంలో గురువారం శ్రీవారాహి అమ్మవారి ద్వితీయ ఆషాఢ గుప్త నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత కనకదుర్గమ్మకు విశేషపూజ, ప్రత్యేక అలంకారం చేశారు. తెల్లవారుజామున వారాహి అమ్మవారి విగ్రహానికి శాస్త్రోక్త పూజలు చేసి కనకదుర్గమ్మ ఎదుట ముఖ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై ప్రతిష్ఠించారు. వారాహిమాతను పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో అభిషే కించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.