
వృద్ధురాళ్ల హత్య కేసులో నిందితుల అరెస్ట్
సమీప బంధువులకు కూతురు సమాచారం
తెనాలి రూరల్: స్థానికంగా సంచలనం రేకెత్తించిన వితంతు వియ్యపురాళ్ల జంట హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఓ మహిళ, యువకుడు, మైనర్ బాలుడు ఉండటం విశేషం. స్థానిక త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో సీఐ ఎస్.రమేష్బాబు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు వివరాలను వెల్లడించారు. పరిమి రోడ్డులో నివసించే దాసరి రాజేశ్వరి(59), పీటా అంజమ్మ(70) ఈనెల 19న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మృతుల సమీప బంధువు మోర్ల రాజారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. మారీసుపేటకు చెందిన అత్తోట కుసుమకుమారి, పరిమి రోడ్డుకు చెందిన ఇళ్ల గోపీకృష్ణ, చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ కలాం(మైనర్)ను పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలు రాజేశ్వరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె చైన్నెలో ఉండగా కుమారుడు అమెరికాలో స్థిరపడ్డాడు. రాజేశ్వరి భర్త నాలుగు సంవత్సరాల కిందట మృతి చెందాడు. ఆమె వియ్యపురాలు పీటా అంజమ్మ భర్త కూడా రెండేళ్ల కిందట మృతి చెందాడు. అంజమ్మ, రాజేశ్వరి వియ్యపురాళ్లు కావడంతో ఇద్దరు పరిమి రోడ్డులోనే కలిసి ఉంటున్నారు. వృద్ధుల ఆలనా పాలన సమీప బంధువు వీరేష్బాబు చూస్తున్నాడు. మహిళలు ఇద్దరు డాబా పై భాగంలో ఉంటున్నారు. కింది భాగంలో నాలుగు గదులు, గతంలో అప్పడాల ఫ్యాక్టరీ నిర్వహించిన ప్రాంతం ఖాళీగా ఉంది. దానిని అద్దెకిచ్చేందుకు బోర్డు పెట్టారు. మృతులు ఉంటున్న ఇంటికి సీసీ కెమెరాలు అమర్చిన రాజేశ్వరి కుమార్తె ధనలక్ష్మి చైన్నెలో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు.
ఇంటిని అద్దెకు తీసుకునే నెపంతో..
మృతుల వద్ద బంగారం, నగదు ఉందన్న విషయాన్ని గుర్తించిన నిందితులు వారిని హతమార్చి, అపహరించాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 19న మధ్యాహ్నం వచ్చి ఇంటిని అద్దెకు తీసుకునే నెపంతో మాటలు కలిపారు. లోపలకు చొరబడి తూకం రాయితో దాడి చేసి రాజేశ్వరిని హతమార్చారు. వియ్యపురాలు కిందకు వెళ్లి చాలాసేపటికి పైకి రాకపోవడంతో అంజమ్మ పైనుంచి కేకలు వేసింది. ఆమెను రాజేశ్వరి పిలుస్తోందని రమ్మని కుసుమకుమారి చెప్పడంతో కిందకు వచ్చిన ఆమె గొంతుకు టవల్ బిగించి హతమార్చారు. రాజేశ్వరి మెడలో ఉన్న బంగారపు నాంతాడు, అంజమ్మ చేతులకు ఉన్న నకిలీ గాజులను అపహరించారు. మృతుల్లో ఒకరి చేతిలో కరన్రు, మరొకరి చేతిలో తూకం రాయిని ఉంచి, ఇద్దరూ పరస్పరం ఘర్షణ పడడంతో మృతి చెందారన్న భ్రమ కల్పించే ప్రయత్నం చేసి ఉడాయించారు.
చైన్నెలో ఉన్న రాజేశ్వరి కుమార్తె ఫోన్ చేసినా ఇద్దరూ స్పందించకపోవడడం, సీసీ కెమెరా ఫుటేజ్లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతో కంగారు పడిన ఆమె, సమీప బంధువులైన వీరేష్, రాజారావును ఇంటికి వెళ్లి చూడాలని కోరింది. వారు వచ్చి చూడగా రాజేశ్వరి, అంజమ్మ రక్తపు మడుగులో మృతి చెంది ఉన్నారు. విషయాన్ని వెంటనే వారు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను అదుపులో తీసుకొని ప్రశ్నించగా నేరం అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు అపహరించిన బంగారాన్ని తాకట్టు పెట్టి లక్ష రూపాయలు తీసుకొని వాటిలో కొంత నగదును ఖర్చు చేశారని, మిగిలిన రూ.34,500ను, నాంతాడు, నకిలీ గాజులను, వారు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా ఈ కేసులో నిందితురాలైన మహిళ కుసుమకుమారి గోపీకృష్ణ, కలాంలతో కలసి గత నెలలో కూడా ఇదే తరహాలో తన ఇంటి ఎదురు నివసించే మరో మహిళను కూడా హతమార్చి బంగారం అపహరించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు డీఎస్పీ చెప్పారు. మూడు రోజుల్లోనే నిందితులను అరెస్టు చేసిన సీఐ ఎస్ రమేష్ బాబు, ఎస్ఐ షేక్ కరీముల్లా, సిబ్బంది పి. మురళి, ఎస్. జయకర్, డి. సురేష్ బాబు, కల్యాణిలను ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ చెప్పారు.
మైనర్ సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇదే ముఠా గత నెలలో మరో మహిళను హత్య చేసినట్టు దర్యాప్తులో వెల్లడి