నేల బావిలో ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృతి
మాచవరం మండలం కొత్తపాలెంలో ఘటన
మాచవరం: వేసవి సెలవులు కావడంతో సరదాగా ఈతకు వెళ్లి నేల బావిలో కూరుకుపోయి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన మాచవరం మండలంలోని కొత్తపాలెం గ్రామం ఎస్సీ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వేమవరపు శ్రీను కుమారుడు జస్వంత్ (9) స్థానిక దళితవాడలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. పప్పుల ఏసయ్య కుమారుడు యేసురాజు (16) మాచవరం జడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఇరువురు మధ్యాహ్న సమయంలో సైకిల్ పై గ్రామ సమీపంలోని శివాలయం పక్కనే ఉన్న పెద్దబావి వద్దకు వచ్చి, దుస్తులు విడిచి ఈత కొట్టేందుకు బావిలోకి దూకారు. బావి లోతు ఎక్కువగా ఉండడంతో ఊపిరి ఆడక చనిపోయారు. కొంత సమయం తర్వాత గ్రామానికి చెందిన ఓ యువకుడు ఈత కొట్టేందుకు బావిలోకి దూకాడు.
బావి అడుగు బాగాన ఇద్దరు చిన్నారులు మృతి చెందడాన్ని గమనించి, విషయాన్ని గ్రామస్తులకు తెలియజేసాడు. అప్పటికే చిన్నారులు కనిపించకపోవడంతో గ్రామంలో వెతుకుతున్న తల్లిదండ్రులకు విషయం తెలిసి ఘటనా స్థలానికి వచ్చి చూడగా దుస్తులు, సైకిల్ను గుర్తించి బోరున విలపించారు. గ్రామస్తుల సహాయంతో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. మృత దేహాలను చూసిన తల్లిదండ్రులు, బందువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గురజాల ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ సాయి కర్ణకుమార్ ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ విజయ్ శేఖర్ తెలిపారు.

ప్రాణం తీసిన ఈత సరదా

ప్రాణం తీసిన ఈత సరదా