
ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పు అని, వాటిని శాసీ్త్రయ పద్ధతిలో నాశనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ చెప్పారు. శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఈ–వ్యర్థాల నిర్వహణపై గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మరెడ్డి పట్టాభిరామ్, కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ తేజ, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ ఇన్చార్జి మేయర్ షేక్ సజీలా, ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులతో కలిసి విజ్ఞాన మందిరం ఆవరణలో మెక్కలు నాటి, నగరంలో ఈ – వ్యర్థాల సేకరణ చేసే వాహనాన్ని ప్రారంభించి, సిగ్నేచర్ క్యాంపెయిన్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల స్టాళ్లను పరిశీలించారు.
అనంతరం సీఎస్ మాట్లాడుతూ ఈ–వ్యర్థాల ఉత్పత్తి ఎక్కువగా ఉందని, వాటిని ఎక్కడపడితే అక్కడ పారేస్తే భూ కాలుష్యం, నీటి కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతారని పేర్కొన్నారు. ఈ–వ్యర్థాల సేకరణకు గుంటూరుతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రెడ్యూస్, రీ యూజ్, రీసైక్లీంగ్ (ఆర్ఆర్ఆర్) సెంటర్లును ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ–వ్యర్థాలను ఆర్ఆర్ఆర్ సెంటర్ల నిర్వహణ ద్వారా సంపద సృష్టించవచ్చని, దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని త్వరలో తీసుకురానుందని వివరించారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఈ – వ్యర్ధాల సేకరణకు ప్రత్యేకంగా ఆర్ ఆర్ ఆర్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వ్యర్థాలకు నగదు కూడా ఇస్తారని వివరించారు. గుంటూరులోని ప్రతి సచివాలయంలో ఆర్ ఆర్ ఆర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్వో ఎన్ఎస్కే ఖాజావలి, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ నదీమా ఖాన్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జయలక్ష్మి, డ్వామా పీడీ శంకర్, డీపీఓ సాయికుమార్, మెప్మా పీడీ విజయలక్ష్మీ, ఎస్సీ కార్పరేషన్ ఈడీ దుర్గాబాయి, ఆర్డీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.