‘98’ డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘98’ డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి

Apr 3 2025 2:06 PM | Updated on Apr 8 2025 1:18 PM

మంగళగిరి టౌన్‌: 1998 డిఎస్సీ అభ్యర్ధులకు న్యాయం చేయాలని ఓబీసీ జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళగిరి ఐబీఎన్‌ భవన్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులందరికీ వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంకా ఉద్యోగం రాని వారికి వయోపరిమితి నెలల వ్యవధి మాత్రమే ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. 

డీఎస్సీ రిమైనింగ్‌ కాండిడేట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా ఇంతవరకు డీఎస్సీపై ఎటువంటి స్పందన లేదని, పలుమార్లు విజ్ఞాపనలు సమర్పించామని పేర్కొన్నారు. 8 జిల్లాల్లో దాదాపు 1500 మంది అభ్యర్ధులు ఉన్నారని, 600 శాంక్షన్డ్‌ పోస్టులు మిగిలి ఉన్నాయని మానవతా దృక్పథంతో మరో 900 పోస్టులు కలిపి తక్షణం ఎస్జీటీలుగా అపాంయింట్‌మెంట్లు ఇవ్వాలని కోరారు. అనంతరం ప్రెస్‌క్లబ్‌ నుంచి మంగళగిరి అంబేడ్కర్‌ బొమ్మ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 98 డిఎస్సీ అభ్యర్థులు చంద్రయ్య, జగ్గయ్య, రత్నబాబు, రామారావు, గోవిందరావు, సుహాసిని, మేరి తదితరులు పాల్గొన్నారు.

నేడు కేతవరంలోప్రతిష్టా మహోత్సవం

బెల్లంకొండ: మండలంలోని పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామమైన కేతవరంలో కొండపై వేంచేసి ఉన్న లక్ష్మీ నరసింహుని ఆలయంలో గురువారం ప్రతిష్టా మహోత్సవం నిర్వహించనున్నట్లు మండల దేవదాయ శాఖ ఈఓ అవుడూరి వెంకటేశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కొండ దిగువన గల స్వామివారి ఆలయం వద్ద జీవ ధ్వజస్తంభం, పరివార దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉదయం 9 గంటలకు జరగనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.

అభాగ్య శిశువుల కోసం ‘ఊయల’

నరసరావుపేట: అభాగ్యులైన శిశువులను అక్కున చేర్చుకునేందుకు బుధవారం జిల్లా శిశు సంక్షేమం, సాధికారిత అధికారి ఆధ్వర్యంలో పెద్దచెరువులోని శిశుగృహంలో క్రెడిల్‌ బేబీ రెడెప్షంన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మిషన్‌ వాత్సల్య పథకంలో భాగంగా అభాగ్యులైన శిశువులను చెత్తకుప్పలు, కాలువల్లో వేయకుండా బతకనిచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఊయలలో వేయాలని పీడీ ఉమాదేవి కోరారు.

7న నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం

నెహ్రూనగర్‌(గుంటూరు ఈస్ట్‌): నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్‌ రూ.1534.27కోట్ల ఆమోదం కోసం గత నెల 29న జరగాల్సిన కౌన్సిల్‌ సమావేశం ఉగాది, రంజాన్‌ పండగల దృష్ట్యా మెజార్టీ సభ్యుల ఆమోదంతో ఇన్‌చార్జ్‌ మేయర్‌ షేక్‌ సజీల వాయిదా వేసిన సంగతి తెలిసింది. తిరిగిన ఈ నెల 7న ఉదయం 10.30 గంటలకు కౌన్సిల్‌ సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు బుధవారం కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించిన నోటిసులను సభ్యులకు నగరపాలక సంస్థ సిబ్బంది అందజేశారు.

అభాగ్య శిశువుల కోసం ‘ఊయల’1
1/2

అభాగ్య శిశువుల కోసం ‘ఊయల’

‘98’ డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి 2
2/2

‘98’ డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement