
నేడు విశాఖలో ‘సిడ్స్’ సదస్సు ప్రారంభం
గుంటూరు మెడికల్: క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ (సిడ్స్) ఆంధ్ర ప్రదేశ్ చాప్టర్ సదస్సును శనివారం విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నట్లు ప్రముఖ ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్ట్, సిడ్స్ ప్రెసిడెంట్, గుంటూరు హెల్ప్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కోనగంటి కల్యాణ చక్రవర్తి తెలిపారు. అరండల్పేటలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన సదస్సు వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిజీషియన్లు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, మైక్రో బయాలజిస్టులు, పీజీ వైద్య విద్యార్థులు సదస్సుకు హాజరవుతారని పేర్కొన్నారు. విశాఖపట్నం హోటల్ గ్రీన్ పార్క్లో జరిగే సదస్సులో యాంటీబయోటిక్స్లో వచ్చిన ఆధునిక మందులు, చికిత్స పద్ధతుల గురించి వివరిస్తారన్నారు. ‘రైట్ డ్రగ్ – రైట్ టైమ్– రైట్ స్టేజ్’ అనే నినాదంతో సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు. డాక్టర్ వి.రామసుబ్రహ్మణ్యం, డాక్టర్ మోహన్ మహరాజ్, డాక్టర్ శ్రీధర్ శ్రీనివాసన్లు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సీనియర్ సిడ్స్ మెంబర్ డాక్టర్ నర్రెడ్డి సునీత, డాక్టర్ గాయత్రి, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రామసుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. దేశంలోనే ఇన్ఫెక్షన్లపై పోరాటంలో అతి పెద్ద సొసైటీగా తమ సంస్థకు గుర్తింపు వచ్చిందని చెప్పారు. సదస్సులో పలు పరిశోధన, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డాక్టర్ కల్యాణ చక్రవర్తి వివరించారు.
నేడు సీబీఆర్ అకాడమీ
రజతోత్సవాల పోస్టల్ కవరు విడుదల
తెనాలి: కృష్ణాజిల్లాలోని సీబీఆర్ స్పోర్ట్స్ అకాడమీ రజతోత్సవాల సందర్భంగా పోస్టల్ శాఖ ప్రత్యేక కవరును విడుదల చేస్తోంది. చలసాని బాబు రాజేంద్రప్రసాద్ స్థాపించిన స్పోర్ట్స్ అకాడమీతో క్రీడారంగంలో ఆయన విశిష్ట సేవలు, సామాజిక సేవలను గుర్తించి తీసుకొచ్చిన ప్రత్యేక పోస్టల్ కవరును శనివారం సాయంత్రం 4 గంటలకు ఇక్కడి ప్రధాన పోస్టాఫీసులో విడుదల చేయనున్నారు. కార్యక్రమ వివరాలను పోస్టల్ సూపరింటెండెంట్ ఎం.శ్రీనివాసు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రత్యేక పోస్టరు కవరు విడుదలకు ముఖ్య అతిథిగా ఐఆర్ఎస్ అధికారి బీకే రావు హాజరుకానున్నారు. గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ డీవీఎస్సార్ మూర్తి, బ్రిగేడియర్ వెంకటరెడ్డి, సుశీల, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల సైనిక్ సంక్షేమ అధికారి హాజరవుతున్నట్టు వివరించారు. తెనాలి హెడ్ పోస్ట్మాస్టర్ ఈ.నాగేశ్వరరావు, సిబ్బంది నిర్వహించే ఈ కార్యక్రమానికి మా–ఏపీ అధ్యక్షుడు దిలీప్రాజా అధ్యక్షత వహిస్తారన్నారు. ఫిలాటిలిస్ట్స్లను కూడా ఆహ్వానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
తాడికొండ: తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో ఈ నెల 23న నిర్వహించనున్న ‘సుపరిపాలన– తొలి అడుగు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి సంయుక్త కలెక్టర్ ఎ భార్గవ్ తేజతో కలిసి పరిశీలించారు. సభాస్థలి, బారికేడింగ్, వాహనాల పార్కింగ్, సీటింగ్ పలు ఏర్పాట్లపై అధికారులతో చర్చించి, పలు సూచనలు చేశారు. తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. అధికారులంతా తమకు కేటాయించిన విధులను పాటిస్తూ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, సీఆర్డీఏ ఈఈ శ్రీనివాసరావు, తుళ్లూరు తహసీల్దార్ సుజాత పాల్గొన్నారు.

నేడు విశాఖలో ‘సిడ్స్’ సదస్సు ప్రారంభం