
నడుములు విరుగుతున్నాయ్ !
గుంటూరు ఎడ్యుకేషన్: అమరావతి రోడ్డులోని అన్నదాన సత్రం పక్క రోడ్డు అధ్వానంగా మారింది. అమరావతి రోడ్డు మీదుగా కొరిటెపాడు సెంటర్కు వెళ్లేందుకు కీలకంగా ఉన్న ప్రధాన రహదారి పొడవునా గోతులు, గుంతలతో నిండి పోయింది. వాహనాల రాకపోకలకు ఏ మాత్రం అనువుగా లేదు. నిత్యం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్తులతో వందలాది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు నిత్యం ఈ రోడ్డు మీదుగా ప్రయాణం సాగిస్తాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రహదారులను నిర్మిస్తున్న నగరపాలకసంస్థ అధికారులు అమరావతి రోడ్డు, కొరిటెపాడును కలుపుతూ సాగుతున్న ఈ రోడ్డు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా గుంతల్లో ప్రయాణంతో నడుములు విరుగుతున్నాయని వాహనదారులు, ప్రజలు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులతో పాటు నూతన రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
●లక్ష్మీపురం 3వ లైను రహదారిపై పడిన భారీ అగాధం ప్రమాదకరంగా మారింది. రోడ్డు ముఖ ద్వారంలో పైపులైనుకు ఏర్పడిన లీకేజీ కారణంగా దెబ్బతింది. అక్కడ భారీ గుంత ఉన్న సంగతి తెలియక వాహనదారులకు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించిన గుంతను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.
అధ్వానంగా అన్నదాన సత్రం పక్క రోడ్డు రోజూ వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు మరమ్మతులను పట్టించుకోని నగరపాలక సంస్థ అధికారులు

నడుములు విరుగుతున్నాయ్ !