ప్రపంచ దోమల దినోత్సవం
మనుషులపై మలేరియా ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ వ్యాధికి దోమలే కారణం. దోమలు వృద్ధి చెందడం వల్ల మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ అనారోగ్య పరిస్థితులకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు లేకపోవడం, తగినంత మంది పారిశుధ్య కారి్మకులు లేకపోవడంతో చెత్త, మురుగు ఎక్కడికక్కడే పెరిగిపోయి దోమలు ప్రభావం తీవ్రంగా ఉంది. ‘వరల్డ్ మస్కిటో డే’ సందర్భంగా ఈ కథనం..
దోమలు కలిగించే వ్యాధులివీ
అనాఫెలస్ దోమ: ఈ దోమ వల్ల మలేరియా వ్యాధి సోకుతుంది. ఇది శుభ్రమైన నీటిలో సంచరిస్తుంది. ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు.
క్యూలెక్స్: ఈ దోమ వల్ల ఫైలేరియా, మెదడుకు సంబంధించిన వ్యాధి సోకుతుంది. ఇది మురుగు నీటిలో మసులుతుంది. ఇది 11 కిలోమీటర్లు మేర సంచరిస్తూ ఉంటుంది.
ఏడిస్: ఈ దోమ వల్ల డెంగీ, చికెన్గున్యా వ్యాధులు సోకుతాయి. ఇది చెట్టు తొర్రలు, నివాస ప్రాంతాల్లోని వస్తువుల్లో నిల్వ ఉంచిన నీటిలోనూ, కొబ్బరి డిప్పలు, పశువల పాకలవు వద్ద అపరిశుభ్రత పరిస్థితులమధ్య సంచరిస్తుంది.ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు.
మేన్సోనియా: ఈ దోమ వల్ల ఫైలేరియా, చికెన్గున్యా వ్యా«ధులు సోకుతాయి. దీని ప్రభావం ఇండియాలో తక్కువగా ఉంది. ఇది చెరువులు, కాల్వల్లో ఉండే గుర్రపుడెక్క, మొక్కలో ఉంటుంది. ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు.
వ్యాధుల లక్షణాలు ఇలా..
మలేరియా: వణుకుతో కూడిన చలి జ్వరం వస్తుంది. రెండు రోజులకోసారి జ్వరం కనిపిస్తుంది. ప్రాథమిక దశలోనే చికిత్సను ప్రారంభించాలి. తీవ్రత పెరిగతే మెదడు ప్రభావితమై రోగి చనిపోయే పరిస్థితులుంటాయి.
ఫైలేరియా: సాధారణంగా కాలు వాస్తుంది. గజ్జలో బిల్లలు వేస్తాయి. సాయంత్రం వేళ తక్కువ స్థాయిలో జ్వరం కనిపిస్తుంది.
డెంగీ జ్వరం: జ్వరం తీవ్ర స్థాయిలో ఉంటుంది. తలనొప్పి, రొంప, కీళ్ల నొప్పులు, గొంతునొప్పి, కళ్ళు ఎర్రబారడం జరుగుతుంది. ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోకుండా జాగ్రత్తపడాలి. శరీలంలో మచ్చలు వస్తే ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయినట్టుగా భావించవచ్చు.
చికెన్గున్యా: ఈ వ్యాధి దీర్ఘకాలంపాటు ఉండొచ్చు. కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. రెండు నెలలు నుంచి ఏడాది పాటు ఈ నొప్పులు బాధించవచ్చు.
వరల్డ్ మస్కిటో డే ప్రాధాన్యం ఇదీ..
బ్రిటీషు దేశానికి చెందిన రొనాల్డ్ రాస్ అనే సైంటిస్ట్ ప్రజలను పట్టిపీడిస్తున్న జ్వరాలపై పరిశోధన చేశాడు. అనాఫెలస్ అనే ఆడ దోమ వల్ల మలేరియా అనే వ్యాధి సోకుతుందన్న విషయాన్ని 1897 ఆగస్టు 20న ప్రపంచానికి తన పరిశోధన ద్వారా తెలియపర్చాడు. ఆయన సేవలకు గుర్తింపుగా ఆగస్టు 20ను అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించారు.
- రొనాల్డ్ రాస్, సైంటిస్ట్


