ఈ ముగింపు ఏ ఆరంభానికి..? | Uttar Pradesh IAS officer Divya Mittal resigned after 13 years | Sakshi
Sakshi News home page

ఈ ముగింపు ఏ ఆరంభానికి..?

Sep 1 2026 5:05 AM | Updated on Sep 1 2026 5:05 AM

Uttar Pradesh IAS officer Divya Mittal resigned after 13 years

సందర్భం

కొందరు అధికారులు ఉద్యోగాలకే వన్నె తెస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 2013 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి దివ్య మిట్టల్‌ అలాంటి వారిలో ఒకరు. పదమూడేళ్లగా చేస్తున్న ఉద్యోగానికి స్వచ్ఛందంగా ముగింపు పలుకుతూ రాజీనామా చేశారు. భవిష్యత్‌లో ఏం చేయబోతున్నారో ఇప్పటివరకు చెప్పలేదు. ‘సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను’ అన్నారు. దివ్య తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది...

దివ్య మిట్టల్‌ సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉండే ఐఏఎస్‌ అధికారిణి. ఎవరైనా సందేహం అడిగితే వెంటనే నివృత్తి చేసేవారు. దేశవ్యాప్తంగా యూపీఎస్సీకి ప్రిపేర్‌ అయ్యే లక్షలాది మంది అభ్యర్థులకు ఆమె ‘మెంటార్‌’గా నిలిచారు. మీర్జాపూర్‌ జిల్లా లహురియా దహ్‌ గ్రామం. 

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆ గ్రామ ప్రజలకు పైపుల ద్వారా మంచినీరు అందలేదు. దివ్య మిట్టల్‌ అక్కడ జిల్లా మేజిస్ట్రేట్‌గా ఉన్నప్పుడు వారి దాహాన్ని తీర్చిన తొలి ఆఫీసర్‌గా వారి గుండెల్లో నిలిచిపోయారు. అక్రమ మైనింగ్‌ వంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పరిపాలనా చర్యలు తీసుకున్నారు. ప్రకృతి సంపదను ప్రజల హక్కుగా చూడాలనేది ఆమె నిర్ణయాల్లో కనిపించింది. 

కోట్ల జీతం వదిలి... ఐఐటీ ఢిల్లీలో ఇంజినీరింగ్, ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ పూర్తి చేసిన దివ్య మిట్టల్‌ లండన్‌లో ‘జేపీ మోర్గాన్‌’ సంస్థలో ‘ఎక్సోటిక్‌ డెరివేటివ్స్‌ ట్రేడర్‌’గా పనిచేశారు. ఏడాదికి కోట్లాది రూపాయల వార్షిక వేతనాన్ని అందుకునే వారు. కోట్ల రూపాయల ΄్యాకేజీని వద్దనుకొని 2011లో స్వదేశానికి వచ్చి యూపీఎస్సీకి ప్రిపేరై ఐఏఎస్‌ అయ్యారు. ‘ఐఏఎస్‌లో చేరిన తర్వాత దొరికింది కేవలం ప్రభుత్వ ఉద్యోగం కాదు. వేలాది జీవితాలను తాకే అవకాశం’ అంటూ పలు సందర్భాల్లో ఆమె చెప్పడం విశేషం. 

జీవితాంతం గుర్తుంటుంది... రాజీనామా సందర్భంగా దివ్య మిట్టల్‌ రాసిన లేఖలోని ముఖ్య విషయాలు... ‘ఈ రోజు నా 13 ఏళ్ల ప్రయాణానికి నా ఇష్టంతో విరామం పలుకుతూ ఐఏఎస్‌కు రాజీనామా చేశాను. ఐఏఎస్‌ ఆఫీసర్‌గా పనిచేసే అదృష్టం నాకు లభించింది. చాలా చేయడానికి అవకాశం లభించింది. శక్తి పదవి నుంచి రాదు. ప్రజలు మనపై ఉంచే విశ్వాసం నుంచి వస్తుంది.

 నేను ఏదో ఇవ్వడానికి వచ్చానని అనుకోవడం పొరపాటు. నిజానికి ఎక్కువగా పొందింది నేనే. లహురియా దహ్‌ కొండపై ఉన్న ఒక బామ్మ తన గ్రామానికి తొలిసారిగా నీరు చేరడాన్ని చూసి ఆనందంతో నన్ను ఆశీర్వదించి వెళ్లింది. ఈ రోజు పదవి నన్ను విడిచిపోయింది. కానీ ఆమె స్పర్శ మాత్రం జీవితాంతం నన్ను విడిచిపెట్టదు. ఈ దేశపు మట్టి నాకు అందించిన ఆ కల కూడా ఎప్పటికీ నన్ను విడిచిపెట్టదు.

రాజీనామా ఎందుకు?
మీర్జాపూర్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న దివ్యా మిట్టల్‌ను బదిలీ చేయడంతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అయిదు నెలలు ఆమెకు ఏ పోస్ట్‌ కేటాయించలేదు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌ గ్రామీణ రహదారుల సంస్థ సీఈవోగా నియామకం అయ్యారు దివ్య. రాజీనామా చేయడానికి ముందు రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక కార్శదర్శిగా పనిచేస్తున్నారు. 

తన రాజీనామాకు కారణం చెప్పకపోవడంతో రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువ సమయాన్ని కుటుంబంతో గడపడానికి, బోధనలు, రచనలు చేయడానికి, సామాజిక సేవ కోసం రాజీనామా చేశారనే అభి ప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు....ఉద్యోగప్రస్థానంలో ప్రభుత్వం నుంచి దివ్యకు ఇబ్బందులు ఎదురై ఉంటాయని ఒక వాదన. ఒకవేళ అలాంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే...అవేంటో త్వరలోనే ఆమె మాటల్లో వినవచ్చు.

– చైతన్య వంపుగాని, సాక్షి, న్యూదిల్లీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement