
ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతున్న అంశాలలో ‘మాదక ద్రవ్యాల తయారీ–అక్రమ రవాణా– క్రయవిక్రయాలు–వినియోగం’ అతి ముఖ్యమైనవి. వీటిని అరికట్టడానికి వివిధ దేశాలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయినా, మాదక ద్రవ్యాల నిర్మూలనలో ఆశించిన ఫలితాలు రావడం లేదు.
మనకు మిక్కిలి హాని కలిగించే కొన్ని మత్తు పదా ర్థాలను మాదకద్రవ్యాలు (డ్రగ్స్) అని వ్యవహరిస్తారు. ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, కొకైన్, ఎల్ఎస్డీ వంటి మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించి రహస్యంగా వినియోగదారులకు అందిస్తూ డబ్బు సంపాదించడం కొందరికి లాభసాటి వ్యాపారం అయ్యింది. కానీ వాటికి అలవాటుపడిన వారు మాత్రం ఆరోగ్యం కోల్పోయి బికారులవుతున్నారు.
తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు పిల్లల ముందే మత్తు పదార్థాలను వినియోగించడం వల్ల పిల్లలూ వాటికి ఆకర్షితులవుతున్నారు. ఒత్తిడిని తట్టుకోలేని సున్నిత మనస్కులు వీటిని ఆశ్రయిస్తున్నారు. కనుచూపు మేరలో మత్తు పదార్థాలు అందుబాటులోకి రావడం, పాశ్చాత్య పోకడలు, టీవీ, సోషల్ మీడియాల ప్రభావం వల్ల యువత వీటిబారిన పడుతున్నారు.
పలు జాతీయ సర్వేల ప్రకారం... మత్తు పదార్థాలు సేవించేవారిలో ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. శారీరక సమస్యలకు తీవ్రంగా గురవుతారు. ఒత్తిడికి, మానసిక సమస్యలకు గురవుతారు. భార్యల నుండి విడాకులు కోరుతున్నారు. నేరపూరిత ఆలోచనలతో గడుపుతున్నారు. చాలామంది లైంగిక సామర్థ్యం కుంటుపడుతోంది. స్థూలకాయం లాంటి సమస్యలతోనూ బాధ పడుతున్నారు.
– డా.బి. హర్షిణి
ఎమ్డీ (సైకియాట్రీ), మంగళూర్, కర్ణాటక
(నేడు అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినం)