
తాత్వికథ
తొండమనాడు రాజు ఓ పర్వదినాన శేషాచలం కొండలలోని అద్భుత సహజ శిల్పకళా చమత్కారమైన తుంబురు తీర్థం దర్శించడానికి వెళ్ళాడు. సనక సనంద తీర్థం, నల్లగుండాల మీదుగా దట్టమైన అటవీలోయలో నడుచుకుంటూ తుంబురు తీర్థం చేరాడు. భూ పరిణామ క్రమంలో భాగంగా ఓ కొండ కొబ్బరిచిప్పలా రెండుగా విచ్చుకుని చివర్లో జలజల ΄ారుతున్న తుంబురు తీర్థం జలపాతాన్ని చూస్తూ గంటలకొద్దీ గడిపినాడు. పక్కనే వున్న తరిగొండ వెంగమాంబ గుహ వద్ద వున్న నిశ్చలానంద స్వామిని దర్శించుకున్నాడు.
తనకు అష్టైశ్వర్యాలున్నా ఎందులోనూ ఆనందం కనిపించడం లేదని బాధను వ్యక్తం చేశాడు. నిశ్చలానంద స్వామి చిరునవ్వు నవ్వాడు. అప్పుడే కాలినడకన కొందరు భక్తులు గోవిందలు చెప్పుకుంటూ తిరుమల కొండకి నడిచి వెళుతున్నారు. వారు నడిచి నడిచి అలసిపోయి ఉన్నారు. వారికి కడుపు నిండా అన్నం పెట్టి, వారు భోజనం చేసి వెళ్లేటప్పుడు రాజును వారి కళ్ళలోకి చూడమన్నాడు.వెంటనే రాజు తనతో వచ్చిన వంటవాళ్లను, భటులను పురమాయించి చకాచకా వంటలు చేయించాడు. వేడివేడిగా అరటి ఆకులో వడ్డించిన వంటలను కాలి నడక భక్తులు ఆవురావురుమని తినసాగారు. అలా తింటున్న వారిని చూస్తున్న రాజుకు తాను తినకుండానే కడుపు నిండిపోయినట్లనిపించింది.
భోజనమయ్యాక భక్తులు ఒక్కొక్కరూ వచ్చి ‘అన్నదాతా సుఖీభవా’ అని చెప్పి వెళ్తుంటే రాజు తృప్తిగా తియ్యటి గుటకలు మింగాడు. రాజు ముఖంలోకి మెరుపు వచ్చింది. తనకి తెలియకుండానే కళ్ల నుంచి ఆనంద భాష్పాలు రాలాయి. అదే అదునుగా భావించిన నిశ్చలానంద స్వామి ‘‘మనం ఒకరికి ఏదైనా ఇస్తున్నామంటే మనం శక్తి మంతులమవుతున్నామని గుర్తుంచుకోవాలి. అందుకే మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వడంలో సహజమైన ఆనందం వుంటుంది. తీసుకోవడం కన్నా ఇవ్వడంలో వున్న ఆనందం పదింతల గొప్పది’’ అని ఇవ్వడంలో వున్న గొప్పదనాన్ని రాజుకు విశదీకరించి చెప్పినాడు.
ఆనంద రహస్యం ఇవ్వడంలోనూ.... దాన గుణంలోనూ వుందని గుర్తించిన రాజు మరిన్ని దానాలు చేయాలని నిర్ణయించుకుని స్వామి పాదాలకు నమస్కరించి తన రాజ్యానికి బయలుదేరాడు.