మన దేశంలో 23 రకాల దేశీయ వరి వంగడాలకు జీఐ | sagubadi 23varieties of rice now honoured with a GI Tag in india | Sakshi
Sakshi News home page

మన దేశంలో 23 రకాల దేశీయ వరి వంగడాలకు జీఐ

Aug 20 2025 10:47 AM | Updated on Aug 20 2025 11:17 AM

sagubadi 23varieties of rice now honoured with a GI Tag in india

పది వేల సంవత్సరాల నాటి సుసంపన్న వ్యవసాయ వారసత్వ సంపద గల ప్రపంచ జీవవైవిధ్య కేంద్రాల్లో ఒక ముఖ్యమైనది భారతదేశం. ఈ అపురూప పాత పంటలకు అవి పుట్టి పెరిగిన స్థానిక ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉంటుంది. అక్కడి వాతావరణం, నేలల స్వభావం, ప్రజల ప్రాధాన్యతలు.. వీటన్నిటితో కూడిన ప్రత్యేక రుచి, రంగు, వాసన,  పోషకాలు, ఔషధ గుణాలతో ఈ స్థానికత ముడిపడి ఉంటుంది. అటువంటి అద్భుతమైన దేశీ వరి వంగడాలను అనాదిగా ఏటేటా సాగు చేస్తూ, వాటిని పరిరక్షిస్తూ వస్తున్నది రైతులు, ఆదివాసులు. కొత్త వంగడాలు వెల్లువైన ఈ ఆధునిక కాలంలో వీటిని కాలగర్భంలో కలసిపోకుండా కాపాడుకునే పని కూడా పాత పంటల విలువ తెలిసిన వీరే తమ భుజస్కందాలపై వేసుకున్నారు. 

ఇటువంటి పాత పంటలను కాపాడుకోవటానికి ఒకానొక మార్గం వాటికి స్థానికతను ఆధారసహితంగా నిరూపించి తగిన చట్టపరమైన గుర్తింపు ఇవ్వటం. దాన్నే జాగ్రఫికల్‌ ఇండికేషన్‌(జీఐ) అంటాం. జీఐకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని గత వారం ఇదే సాగుబడి ప్లస్‌ పేజీలో చదువుకున్నాం. ఈ రోజు మన దేశంలో జీఐ గుర్తింపు  పొందిన కొన్ని వారసత్వ దేశీ వరి రకాల విశిష్టతల గురించి తెలుసుకుందాం. ఈ విశిష్టమైన దేశీ వరి వంగడాల ఔషధ గుణాలు,  పోషకాలు సమృద్ధిగా మనం అందుకోవాలంటే రసాయన రహిత పద్ధతుల్లో సాగు చెయ్యటం తప్పని సరి!

దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో  పాత వరి రకాల ప్రత్యేకతను మరింతగా రక్షించడానికి, ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం మరిన్ని వరి రకాలకు జీఐ గుర్తింపు ఇవ్వటానికి ప్రయత్నిస్తోంది. రైతులకు ప్రయోజనం చేకూర్చడం, వ్యవసాయ సమాజపు పురాతన సాంప్రదాయ విజ్ఞానాన్ని కాపాడటం, ప్రపంచ వ్యవసాయ రంగంలో భారత్‌ స్థానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.  

1.  టెక్కలి: జీఐ ట్యాగ్‌ ΄పొందిన మొట్టమొదటి ఆసియా వరి రకం. కేరళ తీర ప్రాంత జిల్లాల్లో నీటితో ఎక్కువ కాలం నిండి ఉండే చిత్తడి ప్రాంత  పొలాల్లో పెరిగే సామర్థ్యం ΄ టెక్కలి రకానికి ఉంది. సేంద్రియ పద్ధతుల్లో దీన్ని సాగు చేస్తున్నారు.

2. బాస్మతి: పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో రైతులు విస్తృతంగా పండిస్తున్న బాస్మతి వరి బియ్యాన్ని దేశ విదేశాల్లో ప్రజలు ఇష్టపడి తింటుంటారు. జీఐ ట్యాగ్‌ ΄÷ందిన వరి రకాల్లో ఎక్కువ ప్రజాదరణకు నోచుకుంటున్నది బాస్మతి మాత్రమే అని చెప్పచ్చు. సుగంధం వెదజల్లే ΄÷డవైన గింజ కలిగిన బియ్యం. వండినప్పుడు దాని సువాసన, పొడడవాటి మెత్తటి ఆకృతికి ప్రసిద్ధి చెందింది.

3. కాలానమక్‌: ‘బుద్ధ బియ్యం‘ అని కూడా దీనికి మరో పేరుంది. ఈ పురాతన, సుగంధ రకం పుట్టిల్లు ఉత్తరప్రదేశ్‌. దీన్ని శతాబ్దాలుగా హిమాలయ తీర ప్రాంతంలో సాగు చేస్తున్నారనే నమ్మిక ఉంది. దీని ప్రత్యేక సువాసన బుద్ధుని బహుమతిగా చెబుతారు.

4. గోవింద్‌భోగ్‌: పశ్చిమ బెంగాల్‌కు చెందిన అద్భుత వరి రకం. చిన్న గింజ. మీగడ–తీపి సుగంధ బియ్యం. ఖరీఫ్‌ సీజన్‌  లో పండిస్తారు. దీన్ని సాంప్రదాయకంగా శ్రీకృష్ణుడికి నైవేద్యం కోసం ఈ బియ్యాన్ని వాడతారు.

5. జోహా: అస్సాంలో, ముఖ్యంగా గారో హిల్స్‌లో, పండించే జోహా బియ్యం తీపి వాసనకు, రుచికి, మృదువైన ఆకృతికి ప్రసిద్ధి. ఇందులో అమైనో ఆమ్లాలు, ్ర΄ోటీన్లు అధికంగా ఉంటాయి.

6. చక్‌–హావో: మణిపూర్‌కు చెందిన సువాసనతో కూడిన నల్ల బియ్యం. జిగటగా ఉంటాయి. వండినప్పుడు ఊదా రంగులోకి మారతాయి. ఇది గ్లూటెన్, విటమిన్లు,  ప్రొటీన్లు, ఖనిజాలతో సమృద్ధమై ఉంటుంది. మణిపురి ఇళ్లలో చక్‌–హావో బియ్యానికి లభించే సాంస్కృతిక  ప్రాముఖ్యత దాని విశిష్టతను చాటుతుంది.

7. నవర: కేరళకు చెందిన ప్రసిద్ధినొందిన సాంప్రదాయ వరి రకం. ఔషధ గుణాల పుట్ట. వండుకొని తినటంతో  పాటు ఆయుర్వేద చికిత్సలలోనూ దీన్ని ఉపయోగిస్తున్నారు.

8. వయనాడ్‌ జీరకశాల, వయనాడ్‌ గంధకశాల: ఇవి కేరళలోని వయనాడ్‌ ్ర΄ాంతం నుంచి వచ్చిన రెండు విభిన్న బియ్యం రకాలు. ప్రత్యేకమైన వాసన, రుచికి ప్రసిద్ధి చెందాయి.

9.  పాలక్కడన్‌ మట్ట: ‘రోజ్‌ మట్ట’ బియ్యం అని కూడా పిలుస్తారు. కేరళలోని పాలక్కడ్‌   ప్రాంతంలో పండిస్తారు. ఈ బియ్యానికి ఉండే ఒక రకమైన ‘మట్టి రుచి’ ప్రత్యేకమైనది. అలాగే, దాని పోషకాలతో  పాటు అధిక పీచు పదార్థం వల్ల ప్రసిద్ధి చెందింది.

10. అంబెమోహర్‌: మహారాష్ట్రలో పుట్టిన ఈ చిన్న బియ్యపు గింజలకు విలక్షణమైన మామిడి పువ్వుల మాదిరి సువాసన ఉంటుంది. సున్నితమైన ఆకృతి కూడా ఆకట్టుకుంటుంది.

11. అజరా ఘన్సాల్‌: మహారాష్ట్రలో, ముఖ్యంగా అజరా జిల్లాలో, పండించే ఈ బియ్యం దాని తీపి వాసన, ప్రత్యేకమైన రుచికి ప్రసిద్ధి చెందాయి. సువాసన, అందమైన సన్నని తనానికి సూచికగా దీనికి ‘ఘన్సాల్‌‘ అని పేరొచ్చింది.

12. కతర్ని: బీహార్‌కు చెందిన కతర్ని ధాన్యపు గింజ చాలా చిన్నది. వండిన అన్నం రుచి, వాసన ప్రత్యేకమైనవి. తీపి, మృదుత్వం, సువాసనతో కూడిన కతర్ని చెయురా (అటుకుల)కు కూడా ప్రసిద్ధి చెందింది.

13. తులైపంజి: పశ్చిమ బెంగాల్‌కు చెందిన మరొక సుగంధ బియ్యం రకం తులైపంజి. జిగట లేని, ప్రకాశవంతమైన, సన్నని ధాన్యపు రకం ఇది. చాలా కాలంపాటు సువాసనను నిలుపుకుంటుంది.

14. కైపాడ్‌ : కేరళకు చెందిన మరో వరి రకం. తీర  ప్రాంతాల్లో ఉప్పునీటితో పండించడానికి అనుగుణంగా ఉండే రకం ఇది.

15. బాలాఘాట్‌ చిన్నోర్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ రకానికి జీఐ గుర్తింపు ఉంది.

16. జీరాఫూల్‌: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సుగంధ బియ్యపు రకం.

17. బోకా చౌల్‌: ఒక విలక్షణమైన అస్సాం వరి రకం. దీన్ని ఉడికించకుండానే నీటిలో నానబెట్టి తినవచ్చు. వేడి నీటిలో ఉడికిస్తే వెంటనే, చల్ల నీటిలో నానబెడితే కొంచెం ఆలస్యంగా తినటానికి సిద్ధమవుతుంది.

18. అండమాన్‌ కరెన్‌ ముస్లీ: అండమాన్, నికోబార్‌ దీవులకు చెందిన ఈ వరి రకానికి ఇటీవలే జీఐ ట్యాగ్‌  పొందింది.

19. కోరాపుట్‌ కలజీర: ఇటీవలే జీఐ ట్యాగ్‌  పొందిన ఒడిశా సుగంధ వరి రకం.

20. కలోనునియా: ఇటీవలే జీఐ ట్యాగ్‌  పొందిన పశ్చిమ బెంగాల్‌ సుగంధ వరి రకం.

21. మార్చా బియ్యం : బీహార్‌కు చెందిన సుగంధ వరి రకం. ఇటీవలే జీఐ ట్యాగ్‌  పొందింది.

22. ఉత్తరాఖండ్‌ లాల్‌ చావల్‌: ఉత్తరాఖండ్‌కు చెందిన ఎర్ర  బియ్యపు గింజ రకం.

23. ఆడమ్చిని: ఉత్తరప్రదేశ్‌కు చెందిన చిన్న గింజ సుగంధ వరి రకం ఇది. 
 

ఇదీ చదవండి: 70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ!

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి,డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement