కొబ్బరిచెట్టు కోసం కేసు.. ‘టీ తాగుతూ మాట్లాడుకోండి’ అన్న కోర్టు! | Kerala Coconut Tree Dispute, High Court Gives Unique Verdict In Neighbours Long Running Feud, Check More Details Inside | Sakshi
Sakshi News home page

పొరుగింటి కొబ్బరిచెట్టు.. ఇద్దరి మధ్య చిచ్చు! హైకోర్టు ఆసక్తికర తీర్పు!

Aug 30 2026 10:37 AM | Updated on Aug 30 2026 11:40 AM

Kerala High Court Coconut Tree Neighbor Dispute Verdict

లీగలాటా

‘సొంత లాభము కొంత మానుకు పొరుగువానికి తోడుపడవోయ్‌’ అన్నారు మహాకవి గురజాడ. కానీ కేరళలో ఓ వ్యక్తి ‘పక్కవాని కొబ్బరిచెట్టు పెకలించేదాక నిదురపోనోయ్‌’ అన్నట్టు కంకణం కట్టుకున్నాడు. పంచాయతీ నుంచి హైకోర్టు దాకా కేసులు పెట్టాడు. కల్పవృక్షంగా ఉండాల్సిన కొబ్బరిచెట్టు కలహాల చెట్టుగా ఎందుకు మారింది? కేసుల వరకు వెళ్లడానికి కారణం ఏంటి? ఈ కేసులో హైకోర్టు తీర్పు ఎందుకు ఆసక్తికరంగా మారిందనేదే ఈ వారం ‘లీగలాటా’...

కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని కారేకులం గ్రామంలో గోపీనాథ్, రంజిత్‌ పక్క పక్క ఇళ్లల్లో నివసిస్తున్నారు. ఇద్దరి ఇళ్లకు సరిహద్దుగా ఉన్న గోడకు ఆనుకుని రంజిత్‌ స్థలంలో ఓ కొబ్బరి చెట్టు ఉంది. ఆ చెట్టు తన ఇంటివైపునకు వాలి ఉందని, అది కూలి ఇంటిపై పడితే పాడవుతుందని గోపీనాథ్‌ ఫిర్యాదు. కొబ్బరి ఆకులు, కాయలు పడి తన రెండు కార్లు దెబ్బతినే అవకాశం ఉందని అతని వాదన.

తన సమస్యను వివరిస్తూ పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అది పడిపోయే స్థితిలో ఉంటే తప్ప పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని పంచాయతీ అధికారులు చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులకు, తర్వాత స్థానిక సంస్థలకు చెందిన అంబుడ్స్‌మెన్‌కు సైతం ఫిర్యాదు చేశాడు. వారు సూచించిన పరిష్కారాలతో సంతృప్తి చెందని గోపీనాథ్‌ చివరకు హైకోర్టును ఆశ్రయించాడు.

చెట్టు పరిశీలనకు రూ. లక్ష
కొబ్బరిచెట్టుపై ఉన్న అభ్యంతరాలు, ఆందోళనలను పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై సమగ్ర పరిశీలనకు కోర్టు కమిషనర్‌ను నియమించాలని అభ్యర్థించాడు. ఖర్చులను భరిస్తే నియమిస్తామని కోర్టు చెప్పడంతో అంగీకరించారు. కోర్టు కమిషనర్‌ ఫీజును రూ. లక్షగా నిర్ణయించి చెల్లించాలని ఆదేశించింది. పిటిషనర్‌ ఆ మొత్తాన్ని చెల్లించారు.

ఆ సెక్షన్‌ వర్తించదు
కొబ్బరి చెట్టు ఉన్న ప్రాంతాన్ని  కోర్టు కమిషనర్‌ పరిశీలించారు. చెట్టు బలమైన వేళ్లతో ఉందని వెంటనే పడిపోయే ప్రమాదం లేదని తేల్చారు. చెట్టు పడిపోకుండా ఇప్పటికే  ఇనుప తీగతో కట్టి ఉంచారని, కొబ్బరికాయలు, ఆకులు పక్కస్థలంలో పడకుండా నెట్‌ కూడా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రక్షణ వలను మరింత వెడల్పు చేసి, క్రమం తప్పకుండా శుభ్రం చేస్తే సరిపోతుందని తన నివేదికలో పేర్కొన్నారు.  కమిషనర్‌ నివేదికతోనూ పిటిషనర్‌ సంతృప్తి  చెందలేదు.

కేరళ పంచాయతీరాజ్‌ చట్టం సెక్షన్‌ 238 కింద చర్యలు తీసుకోవాలని అభ్యర్థించాడు. ఈ సెక్షన్‌ ప్రకారం చెట్టు కొమ్మలు లేదా చెట్టు కూలిపోయి వ్యక్తులు, భవనాలు, పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పంచాయతీ, అంబుడ్స్‌మెన్, కోర్టు కమిషనర్‌ నివేదికలన్నీ ఆ చెట్టు వల్ల ప్రస్తుతానికి ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదని తేల్చాయి. అందువల్ల ఈ సెక్షన్‌ కింద చర్యలు తీసుకోలేమని కోర్టు తేల్చింది.

విలక్షణ తీర్పు
పొరుగింటి వారితో ఉన్న చిన్న సమస్య పట్టుదల, అహంకారాల కారణంగా న్యాయవివాదంగా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఈ కొబ్బరిచెట్టుకే గనుక నవ్వే శక్తి ఉంటే, ఇద్దరు పొరుగువారు తన కోసం కొట్టుకోవడం చూసి అది నవ్వుకునేదేమో!’ అని న్యాయమూర్తి చమత్కరించారు. ఇంత చిన్న సమస్యకు కోర్టు సమయాన్ని వృథా చేశారని ఇప్పటికే సివిల్, క్రిమినల్‌ కేసుల పెండింగ్‌ భారం కోర్టులపై ఉందని జడ్జి అసహనం వ్యక్తం చేశారు.

‘పొరుగు వానిని నీలాగే ప్రేమించు’ అనే వాక్యాన్ని ప్రస్తావిస్తూ, ఇద్దరూ కలిసి టీ లేదా కాఫీ తాగుతూ కూర్చుని చర్చించుకుని ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. హైకోర్టు ఈ పిటిషన్‌లో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని తేల్చారు. భవిష్యత్తులో నిజమైన ప్రమాదం ఏర్పడితే పంచాయతీ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘విలువైన కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు ఇద్దరి నుంచి ఖర్చులు వసూలు చేయవచ్చు కానీ, కోర్టు ఉదారంగా వ్యవహరించి ఆ చర్యలు తీసుకోవడం లేదు’ అంటూ పిటిషన్‌ను కొట్టేశారు.

- దిలీప్‌ మాదిరెడ్డి

ఇవీ చదవండి: ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement