సెల్‌ఫోన్‌ పిల్లలు బొద్దుగా.. బద్ధకంగా | Consequence of Showing Mobile Phone While Feeding Kids | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ పిల్లలు బొద్దుగా.. బద్ధకంగా

Mar 25 2026 3:53 AM | Updated on Mar 25 2026 3:56 AM

Consequence of Showing Mobile Phone While Feeding Kids

‘ఫోన్‌ చూపిస్తూ అన్నం తినిపించడం’ ఇది చంటి పిల్లల నుంచి స్కూలు పిల్లల వరకూ తల్లులు ఎంచుకున్న సులభ మార్గం. వాళ్లు ఫోన్‌ చూస్తుంటే నచ్చింది, నచ్చంది కడుపు నిండా పెట్టేయొచ్చనుకుంటారు. ఈ అలవాటు, ఆ తర్వాత ఫోను అలవాటు వారిని ‘భార బాలలు’గా మార్చేస్తోంది.గుజరాత్‌లో 2025లో సాగించిన అధ్యయనం ప్రకారం రోజుకు 4 గంటలు స్క్రీన్‌ టైమ్‌ ఉన్న పిల్లలు అధిక బరువుతో, ఊబకాయంతో బాధ పడుతున్నారు. వివరాలు...

ముంబైలోని హిరానందాని హాస్పిటల్‌లో ఇంటర్నల్‌ మెడిసిన్‌ విభాగంలో పని చేసే డాక్టర్‌ విమల్‌ పహుజా దగ్గరికి 12 సంవత్సరాల పిల్లవాణ్ణి తీసుకువచ్చారు. సమస్య ఏమిటంటే... అతను 6 నెలల్లో 8 కిలోల బరువు పెరిగాడు. గంటలు గంటలు సెల్‌ఫోన్‌ చూస్తూ గేమింగ్‌ చేస్తూ జంక్‌ ఫుడ్, , బర్గర్లు, ఫ్రైడ్‌ స్నాక్స్‌ తిని కోలాలు తాగడం వల్ల ఇది జరిగింది. డాక్టర్‌ పహుజా పరీక్షలు చేయిస్తే ఆ వయసుకే ఆ అబ్బాయికి నాన్‌ ఆల్కహాలిక్‌ ఫాటీ లివర్, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్, విటమిన్‌ డి కొరత, నిద్రలేమి, దీర్ఘ అలసట, చదువు మీద ఏకాగ్రత లేకపోవడం గమనించారు. గుజరాత్‌ రాష్ట్రంలో 2025లో సాగిన ఒక అధ్యయనం ‘యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ కార్డియో వాస్క్యులర్‌ జర్నల్‌’లో ప్రచురితమైన దరిమిలా వివిధ నగరాల్లోని వైద్య నిపుణులు ఈ విషయమై  పై విధంగా తమ అనుభవాలతో తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు.

పదికి ఎనిమిది
గుజరాత్‌లో సాగిన ఈ అధ్యయనంలో 14 ఏళ్ల లోపు పిల్లల్లో పదికి ఎనిమిది మంది అన్నం తినేటప్పుడు ఫోన్‌ గాని, ట్యాబ్‌గానీ కావాలంటున్నారని తేలింది. చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తున్నా, అన్నం తిననని మారాం చేస్తున్నా ఫోన్‌ చేతిలో పెట్టి గబగబా వాళ్ల నోటి నిండా అన్నం కుక్కడం అలవాటు చేసిన తల్లులు పిల్లలు ఎంత ప్రమాదకరమైన ఫోన్‌ అడిక్షన్‌కు మళ్లుతున్నారో తెలుసుకోలేకపోయారు. ఫోన్‌ చూస్తూ తినడం అలవాటయ్యాక ఇక మామూలుగా అన్నం తినే పరిస్థితే ఉండటం లేదు. దీనివల్ల తాము తింటున్నది ఏమిటో, దాని రుచి ఏమిటో, రంగు ఏమిటో తెలుసుకోకనే పిల్లలు కడుపు నింపుకుంటున్నారు. ‘పచ్చి బఠాణీలు ఇష్టపడే పిల్లాడు వాటిని అడగక క్యారెట్‌ కూరైనా సరే గొంతులో పెట్టుకుంటాడు’ అన్నారు ఇలాంటి కేసులే గమనిస్తున్న ముంబైలోని ఎస్‌ఎల్‌ రహేజా హాస్పిటల్‌కు చెందిన డాక్టర్‌ అస్మితా మహాజన్‌.

బుర్రలేని తిండి
ఫోన్‌ చూస్తూ తినడం బుర్ర లేకుండా తినడం. దీనిని ‘మైండ్‌లెస్‌ ఈటింగ్‌’ అంటారు. ముంబైకి చెందిన న్యూట్రిషనిస్ట్‌ సంగీత అయ్యర్‌ ఈ విషయాన్ని ఇలా వివరించారు. ‘మీరు సినిమా హాల్లో పెద్ద పాప్‌కార్న్‌ బకెట్‌ను తీసుకుంటూ ఇంత ఎక్కడ తినగలం అనుకుంటారు. కాని సినిమా చూస్తూ మొత్తం బకెట్‌ను ఖాళీ చేసేస్తారు. మీ బుర్ర సినిమాలో లీనమవడం వల్ల అది తిండికి సంబంధించిన సిగ్నల్స్‌ అన్నీ ఆఫ్‌ చేసి ఇంక చాలు అనే సిగ్నల్‌ పంపదు. అందువల్ల మీరు తింటూనే ఉంటారు.

 పిల్లలు కూడా అలాగే సెల్‌ఫోన్‌ చూస్తూ ఎక్కువ తింటారు’ అన్నారామె. అదొక ప్రమాదమైతే సెల్‌ఫోన్‌ చూడటం వల్ల బ్రేక్‌ఫాస్ట్‌గాని లంచ్‌ గానీ డిన్నర్‌ గానీ స్కిప్‌ చేయడం, పోషక పదార్థాలు తీసుకోకపోవడం, ఆటలకు దూరంగా ఉండటం ఇవన్నీ పెద్ద సమస్యలుగా తర్వాతి రోజుల్లో మారతాయి. ఇటువంటి చిన్నారుల్లో డిప్రెషన్, గుండెజబ్బులు త్వరగా వచ్చే ప్రమాదముందని వైద్యులు అంటున్నారు. వీరిలో కొందరు రుచిని గుర్తించే సామర్థ్యాన్ని సైతం కోల్పోతారని అంటున్నారు.

ఇలా చేస్తే మేలు..
పిల్లలు సెల్‌ఫోన్‌ కు బానిసలుగా మారకుండా తల్లిదండ్రులు కొన్ని చిట్కాలు పాటించవచ్చు.
పిల్లల అభిరుచులు గుర్తించాలి. వాటిని ్రపోత్సహించాలి. చిత్రలేఖనం, సంగీతం, నాట్యం వంటివాటిపై ఆసక్తి పెంచేలా ఇంట్లో వాతావరణాన్ని సృష్టించాలి.
పిల్లల్ని సాయంత్రాలు వాకింగ్‌కు తీసుకెళ్లాలి. ఆ సమయంలో మీ ఫోన్‌ తోపాటు వారి ఫోన్‌  కూడా ఇంట్లోనే పెట్టాలి. 
అన్నం తినేటప్పుడు పిల్లలతో కబుర్లు చె΄్పాలి. స్కూల్లో జరిగిన సంగతులు, ఫ్రెండ్స్‌ విషయాలు మాట్లాడుతూ వారి దృష్టిని ఫోన్‌ నుంచి మళ్లించాలి.
పిల్లలంతా ఒకచోట కలిసి ఆడుకునేలా చర్యలు తీసుకోవాలి. ఆ సమయంలో వారి వద్ద ఫోన్లు లేకుండా చూసుకోవాలి. 
రాత్రి 8 తర్వాత ఫోన్‌ పక్కన పెట్టించాలి. వారితోపాటు మీరు కూడా ఫోన్‌ చూడటం మానేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement