ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని అన్ని విద్యాసంస్థల బస్సుల్లో లొకేషన్ ట్రాకింగ్ డివైస్ (వీఎల్టీడీ), డ్యాష్బోర్డ్ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఉప రవాణా కమిషనరు (డీటీసీ) షేక్ కరీమ్ విద్యాసంస్థల యాజమాన్యాలను కోరారు. చొదిమెళ్లలోని ఆయన కార్యాలయంలో బుధవారం విద్యాసంస్థల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పలు ప్రయోజనాల రీత్యా విద్యాసంస్థల బస్సుల్లో వీఎల్టీడీతో పాటు డ్యాష్బోర్డ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం మంచిదని జిల్లా రహదారి భద్రతా కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీటీసీ కరీమ్ మాట్లాడుతూ డ్యాష్బోర్డ్ కెమెరాల ఏర్పాటు వలన అత్యవసర సమయాల్లో, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వీడియోలు కీలక సాక్ష్యాలుగా ఉపయోగపడతాయన్నారు. అంతేకాకుండా, విద్యార్థుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామనే నమ్మకం తల్లిదండ్రుల్లో కలుగుతుందని, రవాణా నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్టీవో బాలేందు శేఖర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు జీ స్వామి, ఎస్.జగదీశ్బాబు, విద్యాసంస్థల ప్రతినిధులు, పాఠశాల బస్సుల నిర్వాహకులు పాల్గొన్నారు.


