● స్వర్ణవారిగూడెంలో గేదైపె దాడి
● పులిని పట్టుకునేందుకు ప్రత్యేక షూటర్లు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలంలో సంచరిస్తున్న పులి పశువులపై దాడి చేసి చంపుతూ రోజుకో ఊరు మారుస్తోంది. అటవీ అధికారులకు చిక్కకుండా పెద్దపులి అందరిని భయాందోళనకు గురి చేస్తుంది. శనివారం బుట్టాయగూడెం మండలం మర్లగూడెంలో పూనె నుంచి వచ్చిన మత్తు నిపుణులకు దాదాపు పులి చిక్కినట్టే భావించారు. అయితే పులి భావించి వారికి చిక్కకుండా అటవీ ప్రాంతంలోని పాటెమ్మగుడి దాటుకుంటూ రాత్రి ఒంటి గంట సమయంలో పట్టెనపాలెం, అక్కంపేట మధ్యలో బస చేసింది. పులి అక్కడ ఉన్నట్లు రేడియో కాలర్ ద్వారా గుర్తించిన అధికారులు అక్కడికి చేరుకోగానే అక్కడి నుంచి జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం వెళ్ళి అక్కడ గేదైపె దాడి చేసి చంపేసింది. అదే ప్రదేశంలో అటు జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి మండలాల సరిహద్దులో ఒక తోటలో మకాం వేసింది. మళ్లీ పులిని పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు పరంజిలు ఏర్పాటు చేశారు. ఇప్పటికై నా చిక్కుతుందో లేదోనని అటు అటవీశాఖ అధికారుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది.
ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
పులి స్వర్ణవారిగూడెం సమీపంలోనే మకాం వేయడంతో పాములవారిగూడెం, స్వర్ణవారిగూడెం గ్రామాలతోపాటు జంగారెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలెవరూ భయబ్రాంతులకు గురికాకుండా ఉండాలని పులిని పట్టుకుని సురక్షితంగా తరలిస్తామని చెప్పారు. జిల్లా అటవీశాఖ అధికారి సందీప్ రెడ్డి పర్యవేక్షణలో సబ్ డీఎఫ్ఓ వెంకట సుబ్బయ్య, దావీదురాజు, దుర్గాప్రసాద్ బాబు, తదితరులు పులిని పట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక బృందాలు కూడా వస్తున్నట్టు సమాచారం.


