గ్రామం చుట్టూ నీరు
కాంటూరుతో సంబంధం లేకుండా..
● కుక్కునూరు నిర్వాసితుల ఆవేదన
● కాంటూర్ల పేరుతో పరిహారంలో వివక్ష
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్రంలో విలీనం చేసిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఆర్అండ్ఆర్ (రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్) అమలుపై స్పష్టత లేకపోవడంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు ఎత్తు ఆధారంగా గ్రామాలను 41, 45 కాంటూర్లుగా విభజించారు. అయితే, ఒకే గ్రామంలోని కొందరికి 41 కాంటూర్ కింద పరిహారం అందించి పునరావాసానికి తరలిస్తుండగా, మిగిలిన వారిని 45 కాంటూర్ పరిధిలోకి తెచ్చి పరిహారాన్ని నిలిపివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
దారులన్నీ జలమయం
ఇటీవల భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాద హెచ్చరికను దాటడంతో సీతారామనగరం, వెంకటాపురం–వేలేరు, ఎస్సీ కాలనీ దారు లు జలమయమయ్యాయి. కుక్కునూరులో 45 కాంటూరు ఇళ్లతో పాటు ఆంబోతులగూడెం, వింజరం, బెస్తగూడెం సమీపంలోకి వరద నీరు చేరింది. గతంలో వరద ప్రభావం లేని కొన్ని గ్రామాలకు 41 కాంటూరు కింద పరిహారం ఇచ్చారని, ఏటా ముంపునకు గురవుతున్న తమను మాత్రం విస్మరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, కాంటూర్లతో సంబంధం లేకుండా నిర్వాసితులందరికీ ఆర్అండ్ఆర్ పరిహారం అందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బెస్తగూడెం గ్రామం చుట్టూ వరద నీరు చేరింది. గ్రామంలో అందరూ కూలి పనులకు వెళ్లేవారే. చుట్టూ నీరుంటే ఇప్పుడు రోజు ఎలా గడుస్తుంది. ఏటా ఈ ఇబ్బంది తప్పడం లేదు. అయినా ప్రభుత్వం 45 కాంటూరంటూ మాకు పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది.
–పెద్దపల్లి రామయ్య, రైతు, బెస్తగూడెం
మూడు రోజుల క్రితం వచ్చిన వరదతో దాదాపు మండలంలోని చాలా గ్రా మాలకు వెళ్లే వీలు లేకుండా రోడ్లన్నీ మునిగిపోయాయి. ఇప్పటికై నా ప్రభుత్వం కాంటూర్లతో సంబంధం లేకుండా అందరికీ ఆర్అండ్ఆర్ పరిహారం అందించి పునరావాస కాలనీలకు తరలించాలి.
– కొన్నే లక్ష్మయ్య, మండల కార్యదర్శి, సీపీఐ


