● డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
● మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి
● వైఎస్సార్సీపీ నేతల డిమాండ్
ఏలూరు టౌన్ : నిరుద్యోగ యువత, విద్యార్థుల భవిష్యత్తో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని, ఉద్యోగాల కల్పన పేరుతో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) హెచ్చరించారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో డీఎస్సీ–25 అక్రమాలపై రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా ఏలూరు ఏ–1 క్లిష్టల్ కన్వెన్షన్ హాల్లో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, ముఖ్యనేతలు హాజరయ్యారు.
దారుణంగా మోసం చేశారు
జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ డీఎస్సీ– 25లో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులను ప్రభు త్వం దారుణంగా మోసం చేసిందన్నారు. డీఎస్సీ అవినీతికి బాధ్యత వహిస్తూ విద్యామంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యామంత్రి ప్రధాన్తో రాజీనామా చేయించారనీ, ఇదే తరహాలో రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పోస్టుల కుంభకోణం జరిగితే విచారణ చేయించకుండా తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు నేడు మంత్రి లోకేష్ను బహిరంగ చర్చకు రావాలని కోరుతున్నారనీ, నిజంగా మీకు ధైర్యం ఉంటే అవినీతికి పాల్పడలేదని చెబుతూ చర్చకు వెళ్లగలరా అంటూ డీఎన్నార్ ప్రశ్నించారు.
కూటమికి షాక్ తప్పదు
విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తో చెలగాటం ఆడాలని చూస్తే యువత షాక్ ఇస్తారని ఏ లూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) అన్నారు. లోకేష్ అవినీతి జరగలేదని భావిస్తే డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పుడు సర్టిఫికెట్లతో అనర్హులకు ఉద్యోగాలు ఇవ్వటం న్యాయమా? అంటూ నిలదీశారు. నిరుద్యోగులకు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం యువతను నట్టేట ముంచిందని మండిపడ్డారు.
వైఎస్సార్సీపీ ప్రజాపోరాటం
చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ డీఎస్సీ–25 కుంభకోణంపై ప్రజాపోరాటం చేస్తున్నామన్నారు. ఉద్యోగ కల్పన చేయలేకపోతే కనీసం నిరుద్యోగ భృతి ఇస్తామని యువతను నమ్మించారనీ, కూటమి ప్రభుత్వ గద్దెనెక్కి రెండేళ్లు గడిచినా ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల బకాయిలు వేల కోట్లు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ ఏలూరు పరిశీలకుడు డీవీఆర్కే చౌదరి, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్బాబు, చింతలపూడి పరిశీలకుడు దాసరి రమేష్, ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవ, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు డింపుల్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి మోటమర్రి సదానందకుమార్, గ్రీవెన్స్ వింగ్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ల బాచి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి జయకర్, బీసీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, జిల్లా స్థాయి ముఖ్యనేతలు పాల్గొన్నారు.


