నాలుగు వైపులా నీళ్లు..
నిలిచిన రాకపోకలు
● 72 గంటల పాటు మహోగ్రరూపం
● సాధారణ స్థితికి చేరువలో గోదావరి వరద
● జలదిగ్బంధనంలోనే 16 విలీన గ్రామాలు
● ముంపులోనే ఎద్దులవాగు వంతెన
సాక్షి ప్రతినిధి, ఏలూరు/వేలేరుపాడు : గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. 72 గంటలు పాటు మహోగ్రరూపంతో పారిన గోదావరి సాధారణ స్థితికి చేరువలోకి వచ్చింది. ఎగువ ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో వరద నీటి ఉధృతి పూర్తిగా తగ్గింది. దీంతో 17 గ్రామాలు జలదిగ్భందం నుంచి బయటకు రాగా.. 16 గ్రామాలు ముంపులోనే ఉన్నా యి. అలాగే ప్రధాన వారధిగా ఉండే ఎద్దులవాగు వంతెన ఇంకా నీట మునిగే ఉండటంతో ఏజెన్సీలో రాకపోకలకు విఘాతం కొనసాగుతుంది.
గతనెల 27 నుంచి పెరుగుతూ..
ఏటా మాదిరిగా ఈ ఏడాదీ గోదావరి వరద అకస్మాత్తుగా వచ్చింది. గత నెల 27 నుంచి క్రమంగా పెరుగుతూ మూడు రోజులుగా లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరింది. దీంతో పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో జనజీవనానికి విఘాతం కలిగింది. గతనెల 27న 1.87 లక్షల క్యూసెక్కులు, 28న 1.16 లక్షల క్యూసెక్కులు, 29న 1.03 లక్షల క్యూసెక్కులు, 30న 2.14 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం ప్రా జెక్టు నుంచి దిగువకు విడుదల చేశారు. 31 నుంచి ఈనెల 2 వరకు వరద తీవ్రత కొనసాగింది. 31న 6.25 లక్షలు, 1న 12.09 లక్షలు, 2న 14.20 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలైంది. సో మవారం భద్రాచలం వద్ద 36.20 అడుగుల నీటిమ ట్టం నుంచి 6.26 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల కాగా పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే 32.950 మీటర్ల ఎత్తు నుండి 10.40 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
బయటపడ్డ ఇళ్లు
వేలేరుపాడు నుంచి రేపాకగొమ్ము వెళ్లే రహదారి, తాట్కూరుగొమ్ము, కన్నాయిగుట్ట రహదారులు, మేళ్లవాగు వంతెన, వేలేరుపాడు సంతబజారు, టేకూరు, కాకిస్నూరు, పేరంటపల్లి గ్రామాల్లో ఇళ్లు ముంపు నుంచి బయటపడ్డాయి. ఎద్దెలవాగు వద్ద నాటు పడవపై ప్రజలు దాటుతున్నారు. వేలేరు పాడు నుంచి రుద్రమకోట రహదారిలో నడిగడ్డలు ప్రాంతంలో రహదారి నీటమునగడంతో ఇటుగా రాకపోకలు స్తంభించాయి.
కూరగాయల పంపిణీతో సరి
అధికారిక లెక్కల ప్రకారం వేలేరుపాడు మండలంలో 31 హాబిటేషన్స్లో 31 గ్రామాల్లో 3,381 మంది గో దావరి వరద వల్ల నిరాశ్రయులయ్యారు. ఆయా గ్రా మాల్లో కేవలం ఉల్లిపాయలు, దోసకాయలు, పచ్చిమి ర్చి, ఆలుగడ్డలు పంపిణీ చేసిన ప్రభుత్వం బియ్యం, వంట నూనె అందించకుండా చేతులు దులుపుకుంది. నూనె లేకుండా కూరగాయలు ఎలా వండుకుని తినాలని వరద బాధితులు ప్రశ్నిస్తున్నారు.
గోదావరి వరదకు ఇంకా 16 గ్రామాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. వరద నీరు గ్రామాలకు నాలుగువైపులా చేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మరోవైపు ప్రధాన రహదారిగా ఉన్న ఎద్దులవాగు ఇంకా నీటిలోనే ఉంది. బుధవారం నాటికి రాకపోకలు పునరుద్ధర ణ జరిగే అవకాశం ఉంది. వేలేరుపాడు మండలంలోని కోయిదా, కట్కరు, దాచారం, తాళ్ల గొంది, పూసుగొంది, చిట్టంరెడ్డిపాలెం, యడవల్లి, బుర్రెడ్డిగూడెం, టేకూరు, సిద్దారం, కుంకు డు కొయ్యలపాకలు, మరో 5 గ్రామాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.


