ఏలూరు (టూటౌన్): ఉమ్మడి జిల్లాలో అక్టోబర్ 31 వరకు నిర్వహించనున్న మధ్యవర్తిత్వం 3.0 ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి ఆధ్వర్యంలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం వద్ద ర్యాలీని ప్రారంభించి న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ గతేడాది 1.0, 2.0లో కేసుల పరిష్కారానికి విశేష కృషి చేశామని, అదే స్ఫూర్తితో 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. వారం పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. రాజీయోగ్యమైన కేసుల సామరస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అన్ని కోర్టుల పరిధిలో మధ్యవర్తులు ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, 7వ అదనపు జిల్లా జడ్జి వైస్. శ్రీనివాసరావు, 8వ అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి, పర్మినెంట్ లోక్అదాలత్ చైర్పర్సన్ మేరీ గ్రేస్కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనె సీతారాం, న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.


