ఏలూరు (టూటౌన్): జిల్లాలో తల్లి, శిశు మరణాలను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు మాతృ–జీరో ఐఎంఆర్, ఎంఎంఆర్ పైలట్ ప్రాజెక్టుపై కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది సమన్వయంతో పనిచేసి మాతాశిశు మరణాలను పూర్తిగా నివారించాలని ఆదేశించారు. హైరిస్క్ ఉన్న గర్భిణులను గుర్తించి, ప్రసవానికి నెల రోజుల ముందు నుంచే రోజువారీగా వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని, ప్రతి హైరిస్క్ గర్భిణీ పర్యవేక్షణకు ఒక అడాప్షన్ అధికారిని నియమించాలని ఆదేశించారు. గర్భిణులు యోగా, వ్యాయామం, నడక సాగించేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రసవానంతరం 40 రోజుల పాటు సిబ్బంది మాతాశిశు గృహాలను తప్పనిసరిగా సందర్శించి వైద్య సేవలు, పౌష్టికాహారంపై సలహాలు అందించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు. శోభ, ఐసిడిఎస్ పీడీ పి. శారద, డీసీహెచ్ఎస్ డాక్టర్ సి.హెచ్. బేబికమల, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. పద్మావతి, నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు మరియు నూజివీడు నియోజకవర్గ వైద్యాధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ కె. వెట్రిసెల్వి


