నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియెట్ పూర్తి చేసి 2025–26 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఈఏపీసెట్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. ఈఏపీసెట్కు జిల్లా నుంచి మొత్తం 5,597 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. మంగళవారం నుంచి 18 వరకు ఇంజనీరింగ్ విభాగం, 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు రెండు షిఫ్టుల్లో ఉద యం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించరు.
ఆరు ఇంజనీరింగ్ కాలేజీలు
జిల్లాలో ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ బ్రాంచ్ల్లో సీట్లు ఉన్నాయి. ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1,200 సీట్లు, రామచంద్ర కళాశాలలో 900 సీట్లు, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో 600 సీట్లు, హేలాపురి కళాశాలలో 360 సీట్లు, ఎన్ఆర్ఐ కళాశాలలో 1,360 సీట్లు, సారథి ఇంజనీరింగ్ కళాశాలలో 420 సీట్లు ఉన్నాయి. అయితే ఈ ఏడాది మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా కళాశాలల యాజమాన్యాలు సీట్ల పెంపు కోసం ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)కు దరఖాస్తు చేసుకున్నాయి. ఆగిరిపల్లిలో ఉన్న ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాల ఈ ఏడాది నుంచి యూ నివర్సిటీగా ఉన్నతి పొందడంతో ఈ సీట్ల భర్తీ ఈఏపీసెట్ పరిధిలోకి రావు.
5,597 మంది విద్యార్థులు
జిల్లాలో మొత్తం 5,597 మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇంజనీరింగ్ కోర్సులకు 4,002 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు 1,595 మంది ఉన్నారు. గతేడాది అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు ముందు నిర్వహించగా ఈ ఏడాది ఇంజనీరింగ్ పరీక్షలు ముందు నిర్వహించనున్నారు.
సీఆర్ఆర్ ఇంజనీరింగ్లో..
సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 12న ఉదయం 180 మందిని, మధ్యాహ్నం 180 మందిని, 13న ఉదయం 180 మందిని, మధ్యాహ్నం 180 మందిని, 14న ఉదయం, మధ్యాహ్నం 180 మంది చొప్పున, 15న ఉదయం మధ్యాహ్నం 180 చొప్పున, 18న ఉదయం, మధ్యాహ్నం 180 మంది చొప్పున కేటాయించారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి 19, 20 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం 120 మంది చొప్పున కేటాయించారు.
ఏలూరు ఇంజనీరింగ్లో..
ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో 12న ఉదయం, మధ్యాహ్నం 171 మంది చొప్పున, 13,14,15 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం 170 మంది చొప్పున కేటాయించగా ఈ కేంద్రంలో 18న విద్యార్థులను కేటాయించ లేదు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి 19, 20 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం 120 మంది చొప్పున కేటాయించారు.
ఇంజనీరింగ్ విభాగ పరీక్షలు 12 నుంచి 18 వరకు..
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగ పరీక్షలు 19, 20వ తేదీల్లో..
ఇంజనీరింగ్ అభ్యర్థులు 4,002
అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులు 1,595
జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలు.. 5,597 మంది విద్యార్థులు
రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహణ
రేపటి నుంచి 20 వరకు పరీక్షలు
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఎప్పటిలానే ఈఏపీసెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరు. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను కేంద్రంలోనికి అనుమతించరు. పరీక్షా కేంద్రానికి వచ్చే విద్యార్థులు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఫారం, అడ్మిట్ కార్డులు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. విద్యార్థులు గంట ముందుగానే వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో రిపోర్ట్ చేయడం ఉత్తమం.
– పి.బాలకృష్ణ ప్రసాద్, ఈఏపీసెట్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్
కేంద్రాల వారీగా అభ్యర్థులు
ఆన్లైన్ పరీక్షలకు ఏలూరులో మూడు కేంద్రా లను కేటాయించారు. వాటిలో సిద్ధార్థ క్వెస్ట్ పా ఠశాల, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ఏ లూరు ఇంజనీరింగ్ కళాశాల ఉన్నాయి. సిద్ధార్థ క్వెస్ట్ కళాశాలలో 12న ఉదయం 120 మందిని, మధ్యాహ్నం 120 మందిని, 13న ఉదయం మధ్యాహ్నం 120 మంది చొప్పున కేటాయించారు. 19న జరిగే అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షకు ఉదయం, మధ్యాహ్నం 169 మంది చొ ప్పున కేటాయించగా, 20న ఉదయం 169 మందిని, మధ్యాహ్నం 168 మందిని కేటాయించారు.


