నూజివీడు : స్థానిక ట్రిపుల్ఐటీలో పీయూసీ విద్యార్థులు గురువారం విశ్వం ఏఐ ఇంటర్న్షిప్కు హాజరయ్యారు. దీనికి వెయ్యి మంది విద్యార్థులు రిజిస్టర్ కాగా, జూన్ 20వరకు ఇంటర్న్షిప్ ఆన్లైన్లో కొనసాగుతుంది. స్వేచ్ఛ సంస్థకు చెందిన రంజిత్ రాజ్ (ప్లాట్ఫామ్ ఇంజినీర్), పోనకాల రాజశేఖర్ (క్లౌడ్ ఇన్ఫ్రా ఇంజినీర్, విశ్వం ఏఐ), డాక్టర్ గొర్ల ప్రవీణ్ (విశ్వం ఏఐ ముఖ్య పరిశోధకులు) పాల్గొని విద్యార్థులకు ప్రోగ్రామింగ్ కు సంబంధించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, తెలుగు శాఖాధిపతి ఝాన్సీ, తెలుగు అధ్యాపకులు విజయ భాను, సీఎస్ఈ ఫ్యాకల్టీ ఉదయ్ పాల్గొన్నారు.
ఏలూరు రూరల్: ఏలూరు ఆశ్రం మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 12న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీనియర్ ఉమెన్, అండర్–23, అండర్–19, అండర్–15 బాలికల క్రికెట్ జట్లు ఎంపిక పోటీలు చేపట్టనున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఆదిత్యవర్మ, కార్యదర్శి వివిఎస్ఎం శ్రీనివాసరాజు గురువారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. 01–09–2011 నుంచి 31–08–2014 మధ్య పుట్టిన వారు అండర్–15 బాలికల విభాగంలో పాల్గొనేందుకు అర్హులని వివరించారు. 01–09–2007 తర్వాత పుట్టిన వారు అండర్–19 విభాగంలో పోటీలకు అర్హులని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు పుట్టిన తేదీ ధ్రువీకరణ, ఆధార్ పత్రాలతో ఉదయం 8 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 83280 43304, 70750 33953 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
తాడేపల్లిగూడెం రూరల్: ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి చోరీకి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై రవికుమార్ తెలిపారు. గురువారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నవాబుపాలెం గ్రామానికి చెందిన బందాల సూరిబాబు ఈ నెల 1న ఓ ఫంక్షన్ నిమిత్తం వేరే ఊరు వెళ్లాడు. తిరిగి 2న ఇంటికి వచ్చి చూడగా తలుపుల తాళాలు పగులగొట్టి ఇంట్లోని ఇత్తడి సామగ్రి దొంగలించారని గుర్తించి, పోలీసులను ఆశ్రయించాడు. ఇత్తడి సామగ్రి విలువ రూ.20 వేలు ఉంటుంది.


