పెనుమంట్ర: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలుగు రాష్ట్రాల క్రీడాకారులకు ఆధునిక పరిపాలన అందుబాటులో తెచ్చి శిక్షణతో పాటు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒలింపిక్ క్రీడాకారిణి సత్తి గీతారెడ్డి అన్నారు. మార్టేరులో జరిగిన ఉమ్మడి రాష్ట్ర రీజనల్ స్పోర్ట్స్ హాస్టలర్స్ రీ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లోని క్రీడాకారులకు ఆధునిక శిక్షణతో పాటు తగిన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో క్రీడల్లో రాణించి ప్రస్తుతం ఉన్నత పదవుల్లో ఉన్న పాత తరం క్రీడాకారులు అందిస్తున్న సహకారం సరిపోదని, మరిన్ని స్పోర్ట్స్ స్కూళ్లు, అకాడమీలను అందుబాటులోకి తేవాలని సూచించారు. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, క్రీడలకు పూర్వవైభవం రావాలంటే స్పోర్ట్స్ హాస్టళ్లను పునరుద్ధరించాలని, కోచ్లను క్రమబద్ధీకరించాలని కోరారు. క్రీడాకారులకు బీమా సౌకర్యం కల్పించి, ఉద్యోగ అవకాశాలు పెంచడంతో పాటు క్రీడా గ్రామాల ఏర్పాటుకు ప్రభుత్వాలు భూమి కేటాయించాలని అభ్యర్థించారు. వచ్చే ఏడాది ఈ సమావేశాన్ని తెలంగాణలోని పెద్దపల్లిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. యూనియన్ కార్యదర్శి ఎన్. రామిరెడ్డి మాట్లాడుతూ, రాజధానుల్లో మెయిన్ హాస్టళ్లు, జిల్లాల్లో రీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని, మౌలిక సదుపాయాల కోసం తగిన బడ్జెట్ కేటాయించాలని కోరారు. అడిషనల్ ఎస్పీ కోటీశ్వరరావు క్రీడాకారులకు ఆరోగ్య భీమా కల్పించవలసిన అవసరాన్ని వివరించారు. ఈ సమావేశంలోని పలు సూచనలను త్వరలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు వెంకట్ నారాయణ, అరుణ, రమేష్, అనిత, సురేంద్ర సింగ్ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి పి.హరికృష్ణ ప్రసాద్, కార్యక్రమ నిర్వాహకుడు సీనియర్ క్రీడాకారులు టి.ఈశ్వర్ రెడ్డి, కర్రి కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, వెలగల సత్తిరెడ్డి, మల్లెల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఒలింపిక్ క్రీడాకారిణి సత్తి గీతారెడ్డి


