రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ముదినేపల్లి(కై కలూరు): ఏడేళ్ల వయస్సులో తండ్రి మరణించాడు. చెల్లికి గుండె ఆపరేషన్ జరిగింది. అయినా పట్టుదలతో ప్యారిస్లో ఎంఎస్ పూర్తి చేసి ఇంటర్న్షిప్ చేశాడు. ఇండియా వచ్చి తిరిగి కొన్ని గంటల్లో విమానంలో వెళ్ళాల్సిన అతను రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. దీంతో పెదనాన్న కుమార్తె పెళ్లి ఇంటి విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ఘటన ముదినేపల్లి మండలం చినపాలపర్రు పామర్రు– దిగమర్రు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగింది.
ముదినేపల్లి మండలం వణుదుర్రు గ్రామానికి చెందిన నవుడు భాను జయప్రకాష్(29) ప్యారిస్లో ఎంఎస్ పూర్తి చేసి ఇంటర్న్షిప్ నిమిత్తం 4 నెలల క్రితం ఇండియా వచ్చాడు. పెదనాన్న కుమార్తె వివాహం ఉండడంతో ఉండిపోయాడు. శుక్రవారం రాత్రి వివాహం ముగించుకుని వాహనంలో బంధువులను వణుదుర్రులో దించి తిరిగి గుడివాడలో తన బాబాయి శివ శంకర నాగరాజు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకున్నాడు. హైదరాబాదు నుంచి శనివారం సాయంత్రం వెళ్ళడానికి టికెట్లు బుక్ అయ్యాయి. తన బాబాయి కారులో గుడివాడ వస్తుండగా ప్రమాదం జరిగి జయరాం ప్రకాష్ మరణించాడు. మృతుడు బాబాయి శివశంకర నాగరాజు ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.
కారును చనుబండకు చెందిన విస్సంశెట్టి నవీన్ నడుపుతున్నాడు. చినపాలపర్రు వద్దకు తెల్లవారుజామున 4 గంటలకు వచ్చారు. జాతీయ రహదారిలో ఎదురుగా వస్తున్న లారీని నవీన్ రాంగ్రూట్లో వెళ్ళి ఢీకొట్టాడు. దీంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. అంబులెన్సులో గుడివాడ ఈవీఆర్ హాస్పటల్కు చేర్చారు. చికిత్స పొందుతూ జయరాం ప్రకాష్ మరణించాడు. నవీన్కు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. భాను ప్రకాష్ మరణంతో అనారోగ్యంతో బాధపడుతున్న చెల్లెలు, తల్లి ఆధారం కోల్పోయారు. దీంతో వణుదుర్రులో విషాద చాయలు అలుముకున్నాయి.


