కాళ్ల: ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా.. గోవిందా.. అంటూ గోవింద నామస్మరణతో కాళ్లకూరు మార్మోగింది. మండలంలోని కాళ్లకూరులో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వరస్వామి తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథయాత్ర వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ, వివిధ మేళతాళాలతో సుందరంగా అలంకరించిన రథంపై స్వామివారు ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రథాన్ని లాగారు. బుట్ట బొమ్మలు, శక్తి వేషాలు, తీన్మార్ డప్పులు, డీజే ఆకర్షణగా నిలిచాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో పురవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. వైశాఖ పూర్ణిమ సందర్భంగా స్వామి, అమ్మవార్లను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈఓ ఎం. అరుణ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.


