● అట్టహాసంగా రథోత్సవం
● మార్మోగిన గోవింద నామస్మరణలు
● నేడు శ్రీచక్రస్నానం, ధ్వజావరోహణం
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం రాత్రి శ్రీవారి రథోత్సవం కనులపండువగా సాగింది. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారికి భక్తులు స్వయంగా సేవ చేసుకునే భాగ్యం ఈ రథ వాహనం ద్వారానే కలుగుతుంది. వేలాది మంది వేడుకలో పాల్గొన్నారు. ముందుగా అర్చకులు ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తొళక్క వాహనంపై ఉంచి పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట భజనలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ వాహనాన్ని రథం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ రఽథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణమూర్తులను ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేసి, హారతులిచ్చారు. అనంతరం ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు దంపతులు, దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు తదితరులు పూజలు నిర్వహించి, బలిహరణను సమర్పించగా రథోత్సవం ప్రారంభమైంది. గోవింద నామస్మరణల నడుమ దివ్య రథం క్షేత్ర పురవీదుల్లో తిరుగాడింది. ఇదిలా ఉంటే శ్రీ కూర్మ జయంతి, అలాగే బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్వామివారు ఆలయ ముఖ మండపంలో శ్రీ కూర్మ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
బ్రహ్మోత్సవాల్లో నేడు..
● ఉదయం 9 గంటల నుంచి.. శ్రీ చక్రవారి, అపభృధోత్సవం
● మధ్యాహ్నం 3 గంటల నుంచి.. వేద సభ
● రాత్రి 9 గంటల నుంచి.. ధ్వజావరోహణం, అనంతరం అశ్వవాహనంపై గ్రామోత్సవం
● శ్రీవారి ప్రత్యేక అలంకారం – నవనీత కృష్ణ
రథంలో శ్రీవారు, అమ్మవార్లకు హారతులు
బలిహరణ సమర్పిస్తున్న దృశ్యం


