ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఇంటింటి జనగణన నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. మే నెలలో నిర్వహించాల్సిన ఇంటింటి జనగణన కార్యక్రమంపై రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్తో కలిసి గురువారం జిల్లా కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఇన్చార్జి డీఆర్ఓ దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు.
జేసీ డా.ఎంజే అభిషేక్ గౌడ
ఏలూరు (టూటౌన్): రబీలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికిగాను ఇప్పటివరకు 1,54,386 టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ చెప్పారు. ధాన్యం సేకరణకు గాను 128 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశామని, 58 లక్షల గొనె సంచులను రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. ఉంగుటూరు మండలంలో 53,485 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. అలాగే అక్కడ 157 వాహనాలను రిజిస్ట్రేషన్ చేసి 16,93,747 గోనె సంచులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతుల ధాన్యాన్ని భద్రపరుచుటకు 325 టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ 18004256453కి లేదా హెల్ప్ డెస్క్ నెంబర్ 77020 03584 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు.
ఏలూరు (టూటౌన్): ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల ఆగడాలను అరికట్టడంలో విఫలమైన ఇంటర్మీడియెట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి (ఆర్ఐఓ) కే యోహాన్ను ఆ పోస్ట్ నుంచి తొలగించాలని కోరుతూ పీడీఎస్యూ నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కాకినాని మాట్లాడుతూ ప్రభుత్వం ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించినా ఇంకా ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలో క్లాసులు నిర్వహిస్తున్నా ఆర్ఐఓ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అలాగే బెటర్మెంట్, సప్లిమెంటరీ నిమిత్తం విద్యార్థుల నుంచి కొన్ని విద్యాసంస్థలు అదనపు ఫీజులు వసూలు చేస్తున్నా, బుక్స్, యూనిఫామ్ పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నా ఆర్ఐఓ పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ నగర ప్రధాన కార్యదర్శి ఎస్ సునీల్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ చరణ్. చింతలపూడి నగర కార్యదర్శి ఎండీ రయాన్, బాలు తదితరులు పాల్గొన్నారు.


