యలమంచిలి: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం 2026–27 సంవత్సరానికి దొడ్డిపట్ల ఫెర్రీ వేలం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.3,50,000 ధరకు వేలం ప్రారంభించగా దొడ్డిపట్ల గ్రామానికి చెందిన చేగొండి వీర వెంకట రమణ రూ.3.82 లక్షలకు పాట దక్కించుకున్నారు. ఫెర్రీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మీ, ఎంపీడీఓ జేడీవీ ప్రసాద్, ఎంపీడీఓ కార్యాలయ పరిపాలన అధికారి పద్మజ తదితరులు ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. వేలం పాటపై నివేదికను జిల్లా పరిషత్ సీఈఓకు పంపుతామని ఆయన నుంచి అనుమతి వచ్చిన తరువాత వేలం ఖరారు చేస్తామని ఎంపీడీఓ జేడీవీ ప్రసాద్ తెలిపారు.


