ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో బుధవారం రాత్రి భారీగా వివాహాలు జరగడంతో పెళ్లి సందడి నెలకొంది. వివాహాలకు బలమైన ముహూర్తం కావడంతో కొండపైన, కింద పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపాలు పూర్తిగా నిండిపోవడంతో, తూర్పు, దక్షిణ రాజగోపురాల వద్ద పలు జంటలు కిందే వివాహాలు చేసుకున్నారు. అలాగే స్వామివారి పాదుకా మండపం వద్ద ఉన్న పాత కల్యాణ మండపంలో అధికంగా వివాహాలు జరిగాయి. పెళ్లి జనాల వాహనాలతో క్షేత్రంలోని ఘాట్ రోడ్లు రద్దీగా మారాయి. ఆలయ ప్రధాన కూడలిలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. క్షేత్రంలోని అన్ని కల్యాణ మండపాల వద్ద పెళ్లి జనాలు భారీగా కనిపించారు.


