తాడేపల్లిగూడెం రూరల్: కుమార్తెను చూసేందుకు వెళ్ళిన తనపై హత్యాయత్నం కేసు పెట్టి పోలీస్స్టేషన్ రప్పించడంతో మనస్తాపం చెందిన మండలంలోని కుంచనపల్లి వాసి మామిళ్ళపల్లి మురళీ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రిలో మురళీ మీడియాతో మాట్లాడారు. తాను, తన భార్య గత కొంతకాలంగా విడిగా ఉంటున్నామని తెలిపారు. రెండ్రోజుల క్రితం తన కుమార్తెతో మాట్లాడేందుకు వెళ్ళానని, తన భార్య రూపావతి, అత్త కలిసి తనపై హత్యాయత్నానికి పాల్పడ్డానని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అదే రోజు రాత్రి రూరల్ పోలీసులు తన ఇంటి వద్దకు వచ్చి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారని, రెండ్రోజుల పాటు పోలీస్ స్టేషన్ వద్ద ఉంచారని వాపోయాడు. దీంతో మనస్తాపం చెంది స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో మురళీ చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. రూరల్ ఎస్సై రవికుమార్ను ప్రశ్నించగా, భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకే అతనిని స్టేషన్కు తీసుకొచ్చామని, మురళీ స్టేషన్ బయట ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు.


