
స్కూళ్లలో పుస్తకాల అమ్మకం అడ్డుకోవాలి
ఏలూరు(ఆర్ఆర్పేట): ఏలూరు నగరంలో ప్రైవేట్ విద్యాసంస్థలు చట్టవిరుద్ధంగా పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అధిక ధరలకు అమ్మడాన్ని అడ్డుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ డిమాండ్ చేశారు. బుధవారం శాంతినగర్లోని పలు విద్యాసంస్థల్లో పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్ముతుండగా ఎంఈఓ రవిప్రకాష్, హర్ష కుమార్ పట్టుకున్నారు. ఈ సందర్భంగా లెనిన్ మాట్లాడుతూ మార్కెట్ ధరల కన్నా 150 శాతం అధిక ధరలకు పుస్తకాలను అమ్ముతూ బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియం విద్య కోసం ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించడాన్ని అవకా శంగా తీసుకున్న విద్యాసంస్థలు తల్లితండ్రుల రక్తాన్ని తాగుతున్నాయని ఒకపక్క అధిక ఫీజులు మరోపక్క పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, ట్యూషన్ ఫీజులు ఇలా అనేక రూపాలలో తల్లిదండ్రులను దోచుకు తింటున్నాయన్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో బుధవారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ జరిగింది. ఈ లెక్కింపులో శ్రీవారికి భారీగా ఆదాయం సమకూరింది. గత 28 రోజులకు నగదు రూపేణా స్వామివాకి రూ. 3,68,88,156 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 317 గ్రాముల బంగారం, 7.877 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ. 49 వేలు లభించినట్టు చెప్పారు.
యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో బహుమతులు
ఏలూరు(మెట్రో): యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీ లలో ఏలూరు జిల్లా రెండు బహుమతులు గెలుచుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి విజేతలకు అభినందనలు తెలిపారు. యోగా స్కిట్ అండ్ రోల్ ప్లే జూనియర్ కేటగిరీలో, సీనియర్ కేటగిరిలో రాష్ట్ర స్థాయిలో బహుమతులు గెలుచుకున్నారు.
సమగ్రశిక్ష సిబ్బంది బదిలీలకు అవకాశం
భీమవరం: జిల్లాలోని సమగ్ర శిక్ష ప్రాజెక్టులోని కాంట్రాక్ట్ సిబ్బంది బదిలీలకు ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్ష అడిషినల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యామ్సుందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్రశిక్ష ప్రాజెక్టులో కాంట్రాక్ట్ సిబ్బందిగా పనిచేస్తున్న ఐఇఆర్పీ, పీటీఐ, సీఆర్ఎంటీ, మండల స్థాయి అకౌంటెంట్, సైట్ ఇంజనీర్స్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, మేసెంజర్స్, ఆఫీసు సబార్టినేట్స్ తదితర సిబ్బంది రిక్వెస్ట్, సరస్పర ప్రతిపాదనల దరఖాస్తులను ఈనెల 19 నుంచి 21 లోగా సమగ్రశిక్ష ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలని శ్యామ్సుందర్ తెలిపారు.
వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించాలి
భీమవరం: వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించి అధిక లాభాలు పొందాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి రైతులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన యంత్ర పరికరాలు, రాయితీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆహార కొరత స్థాయి నుంచి రైతులు విప్లవాత్మకమైన సాగు ద్వారా మిగులు ధాన్యం విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నారన్నారు. జిల్లాకు కిసాన్ డ్రోనన్ గ్రూపులకు 80 శాతం సబ్సిడీతో 41 డ్రోన్లను కేటాయించినట్లు చెప్పారు. 709 మంది సన్న, చిన్నకారు రైతులకు రూ.8.99 కోట్ల విలువైన వ్యక్తిగత యంత్ర పరికరాలకు రూ.3.84 కోట్లు రాయితీపై పంపిణీ చేశామన్నారు.