
ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తాం
పెదవేగి: ఏలూరు జిల్లాలో ఈ ఏడాది 15 వేల హెక్టార్లలో ఆయిల్ పాం విస్తరించాలనే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహార్ తెలిపారు. బుధవారం పెదవేగిలోని ఆయిల్ పాం పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. అధిక దిగుబడినిచ్చే రకాలు, కోకో వంటి అంతర పంటలపై అవగాహన, డెల్టా భూముల్లో ఆయిల్ పాం ప్రోత్సహించడం వంటి వాటిపై సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది 5 వేల నుంచి 15 వేల హెక్టార్ల వరకూ ఆయిల్ పాం సాగు అదనంగా చేపట్టాలని టార్గెట్గా నిర్ణయించామన్నారు. పంట సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో, క్షేత్రస్థాయిలో వాస్తవ సమాచారం అందరితో పాలుపంచుకోవడంలో జాప్యం కనిపిస్తుందన్నారు. దీనిని పరిష్కరించేందుకు జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కేంద్రం నుంచి సబ్సిడీలను అందిపుచ్చుకుని మన ప్రాంతంలో మెరుగైన ఆయిల్ పామ్ సాగు జరిగేలా ప్రయత్నిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, ఆయిల్ పాం పరిశోదనా కేంద్రం డైరెక్టర్ కంచర్ల సురేష్, జిల్లా ఉధ్యానశాఖ అధికారి ఎస్.రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.