
కరెంటు బిల్లు సాకుతో తల్లికి ఎగనామం
కామవరపుకోట కొత్తూరు యానాదుల కాలనీకి చెందిన చౌటూరి కోటమ్మ , భర్త సురేష్ గ్రామంలో కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తమ పిల్లలు దుర్గాప్రసాద్ ఏడవ తరగతి, దీప్తి 3వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీరికి తల్లికి వందనం సొమ్ములు జమకాలేదు. దీంతో స్థానిక సచివాలయానికి వెళ్లి అడిగితే 300 యూనిట్లు పైబడి కరెంటు వాడారని.. అందుకే తల్లికి వందనం డబ్బులు పడలేదని సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో ఆ తల్లి లబోదిబోమంది. మాది రెండు గదులు గల చిన్న ఇల్లని, ఇంటా బయట ఎల్ఈడీ బల్బులు రెండు వాడతామని దానికి 300 యూనిట్ల బిల్లు ఎలా వస్తుందని ఆమె వాపోయింది. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటుంది.
– కామవరపుకోట