
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
ఏలూరు (టూటౌన్): కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీఎన్వీడి ప్రసాద్, ఏఐటీయూసీ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస, ఐఎఫ్టీయు నాయకుడు గడసాల రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడాలని డిమాండ్ చేశారు. జూలై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొని నిరసన తెలియజేయాలని కోరారు. కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్ పేరుతో కాలరాస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలను కార్పొరేట్లకు, ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా మోదీ ప్రభుత్వం అప్పగిస్తుందని వారు తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, బి.సోమయ్య, వీవీఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఐసెట్లో 794 మంది ఉత్తీర్ణత
ఏలూరు (ఆర్ఆర్పేట): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ నెల 7న నిర్వహించిన ఐ సెట్ పరీక్షల ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ మంగళవారం విడుదల చేసింది. ఈ పరీక్షల్లో ఏలూరు జిల్లా నుంచి 794 మంది అర్హత సాధించారు. 414 మంది బాలురు హాజరు కాగా వారిలో 399 మంది అర్హత సాధించారు. 412 మంది బాలికలు హాజరు కాగా వారిలో 395 మంది అర్హత సాధించారు.