కూటమి సేవలో ఖాకీలు! | - | Sakshi
Sakshi News home page

కూటమి సేవలో ఖాకీలు!

Apr 3 2025 2:26 AM | Updated on Apr 3 2025 2:37 AM

కూటమి సేవలో ఖాకీలు!

కూటమి సేవలో ఖాకీలు!

సాక్షి, భీమవరం: అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతూ వారి విధులు విస్మరిస్తున్నారు. కూటమి మూకల దౌర్జన్యాన్ని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదుపై వారం రోజులు కావస్తున్నా కేసు నమోదు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫిర్యాదు అందినట్టుగా ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌తో సరిపెట్టారు. గత నెల 27న అత్తిలి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం వద్ద వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను కూటమి మూకలు నిర్భంధించి ఎన్నికలో పాల్గొనకుండా అడ్డుకున్న విషయం తెలిసిందే. ఎంపీటీసీ సభ్యులు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు వీలులేకుండా రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి మూసివేశారు. దమ్ముంటే తమను దాటి వెళ్లమంటూ అరుపులు, కేకలతో భయానక వాతావరణం సృష్టించారు. ఒకానొక దశలో కారుమూరి ఇంటి గేటును నెట్టుకుంటూ లోపలికి చొరబడే ప్రయత్నం చేశారు. గొడవలు సృష్టించేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కూటమి మూకలు చేసిన దౌర్జన్యకాండకు సంబంధించిన వీడియోలు, సీసీ టీవీ పుటేజీలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలమయ్యాయి. ఎన్నిక వాయిదా పడిన మరుసటి రోజు సైతం మండల పరిషత్‌ కార్యాలయానికి వచ్చే రోడ్లన్నింటిని బ్లాక్‌ చేసి వైఎస్సార్‌సీపీ సభ్యులు ఉన్నారేమోనని వాహనాలను తనిఖీలు చేయడం సంచలనమైంది. ప్రశాంతతకు నిలయమైన అత్తిలిలో ఇలాంటి ఘటనలు ముందెప్పుడూ చూడలేదంటూ స్థానికులు సైతం భయభ్రాంతులకు గురయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లరి మూకలు పెట్రేగిపోయినా పోలీసులు చేష్టలుడిగి చూస్తుండిపోయారే తప్ప వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ సభ్యులకు రక్షణ కల్పించాలని స్వయంగా మాజీ మంత్రి కారుమూరి తణుకు రూరల్‌ సీఐ కృష్ణకుమార్‌, ఎస్‌ఐ ప్రేమరాజు, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించలేదు.

వారం రోజులైన కేసు లేదు

ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అనుచరులు సాగించిన దౌర్జన్యంపై అదే రోజున మాజీ మంత్రి కారుమూరి అత్తిలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆయన అనుచరులు మారణాయుధాలతో తన ఇంటిపై దాడికి తెగబడ్డారని, మహిళ ఎంపీటీసీ సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, తమ సభ్యులు ఎన్నికలకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి సంబంధించి సీసీ పుటేజీ, మీడియా కవరేజీ వివరాలను పెన్‌డ్రైవ్‌లో పెట్టి పోలీసులకు అందజేశారు. వారం రోజులు కావస్తున్నా చర్యలు తీసుకోకుండా జిల్లా పోలీసులు కాలయాపన చేస్తుండటంపై కారుమూరి డీజీపీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఎట్టకేలకు తమకు ఫిర్యాదు అందినట్టుగా మంగళవారం రాత్రి అత్తిలి పోలీసులు రసీదు అందజేశారు. కేసు విషయమై అత్తిలి ఎస్‌ఐ పి.ప్రేమరాజు వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నామని తెలిపారు.

అత్తిలి ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి అనుచరుల అరాచకం

మరుసటి రోజే పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి కారుమూరి

వారం రోజులు కావస్తున్నా కేసు నమోదుకు మీనమేషాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement